హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ అవలంభిస్తున్న వైఖరిని కడియం ఎండగట్టారు. బద్మాష్ మాటలు వద్దు.. రాష్ట్ర బీజేపీ నాయకులు బాధ్యతతో మాట్లాడాలి. బాధ్యత మరిచి బేవకూఫ్ మాటలు మాట్లాడుతున్నారు అని కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు.
రైతులకు తెలంగాణ దిక్సూచిగా ఉండాలని, కేంద్ర వైఖరికి నిరసనగా రైతులకు అండగా ఈ ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రజల యొక్క సమిష్టి పోరాటాల ఫలితంగా కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు నిదులు కేటాయించి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించారు. స్వయంగా తానే ఒక ఇంజినీర్ అయి మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. ఒక్క కాళేశ్వరమే కాదు.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నారు. రైతుబంధు ఇచ్చి, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి వ్యవసాయాన్ని పండుగ చేశారు.
2020-21లో ఒక కోటి పది లక్షల ఎకరాల్లో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి అయింది. ఆకలితో అలమటించే తెలంగాణ అన్నపూర్ణగా ఎదిగి, దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. ఇది కేసీఆర్ శ్రమ వల్లే సాధ్యమైందన్నారు. తెలంగాణలో పంటల దిగుబడి వస్తుంటే.. రాష్ట్రాన్ని అభినందించాల్సింది పోయి, కేంద్రం రైతు వ్యతిరేక చర్యలను తీసుకుంటున్నారు. దేశ భద్రత, ఆహార భద్రత కేంద్రం ఆధీనంలో ఉండాలని నాడు రాజ్యాంగంలో పేర్కొన్నారు. కరువు, పేదరికంతో దేశం అలమటిస్తున్న పరిస్థితుల్లో దేశానికి ఆహార భద్రత ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రజలందరికీ ఆహారం అందుబాటులో ఉండేలా ఎఫ్సీఐ చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. వరిని సేకరించి అవసరమున్న రాష్ట్రాలకు సరఫరా చేయాలని ఎఫ్సీఐని ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ నివేదికను ఆమోదించింది కానీ అమలు చేయడానికి ముందుకు రావడం లేదు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. ఆహార భద్రత అనేది కేంద్రం బాధ్యత. ప్రతి సంవత్సరం రైతుకు కనీసన మద్దతు ధర కల్పించే బాధ్యత కేంద్రానిది. ధాన్యం నిల్వ చేసే బాధ్యత కేంద్రానిది. కానీ కేంద్రం తన బాధ్యతలను విస్మరించి రాష్ట్రాలపై నెట్టేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవగాహనతో మాట్లాడాలి. తెలంగాణ రైతులు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటున్నారు అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.