పట్నా : కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఎన్డీయే భాగస్వామ్యపక్షం పెదవివిరిచింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ముద్రించడం పట్ల బిహార్ లో ఎన్డీయే భాగస్వామ్య పక్షం హిందుస్తానీ అవామ్ మోర్చా చీఫ్, బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఘనతను ప్రధాని మోదీ తనదిగా చాటుకుంటే కరోనా మహమ్మారితో మరణించిన వారి డెత్ సర్టిఫికెట్లపైనా ఆయన ఫోటోను ముద్రించాలని మాంఝీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై రాష్ట్రపతి లేదా సంబంధిత రాష్ట్ర సీఎంల ఫోటోలు ఉండాలని పేర్కొన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సన్నిహితుడిగా పేరొందిన మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) కేటాయించిన సీట్లలో పోటీచేసి నాలుగు స్థానాల్లో గెలుపొందింది.