Munugode by poll Results | మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పుతో బీజేపీ నాయకుల మైండ్ బ్లాంక్ అయిపోయిందని టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై దాసోజు శ్రవణ్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మునుగోడులో బీజేపీ బొక్కా బొర్లా పడ్డదన్నారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ను గుండెల్లో పెట్టుకున్నారు. బీజేపీ తెలంగాణకు పనికిరాదు అని ప్రజలు తేల్చేశారు. అయినప్పటికీ చిల్లర ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.
18 వేల కోట్ల కాంట్రాక్టుల కమీషన్లు తీసుకున్న వారికి మునుగోడు ప్రజలు చరమగీతం పాడారు. కేసీఆర్పై విశ్వాసంతో, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షమే, అభివృద్ధి పథకాలకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ అడ్డదిడ్డంగా పని చేస్తుందని బీజేపీ నాయకులు మాట్లాడటం సరికాదు. బీజేపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు. ఓటమిని తట్టుకోలేక బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. నైతికంగా నేను గెలిచానని రాజగోపాల్ రెడ్డి చెప్పడమంటే ఓడిపోయానని ఒప్పుకోవడమే అని పేర్కొన్నారు. మునుగోడును హస్తగతం చేసుకోవాలన్న కుట్ర పూరిత ప్రయత్నాన్ని మునుగోడు ప్రజలు తిప్పికొట్టారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.