హైదరాబాద్ : రాష్ట్రంలోని గిరిజన బిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో శుభవార్త వినిపించారు. దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధును అమలు చేసి తీరుతామని ప్రకటించారు. గిరిజనుల అభ్యున్నతే తమ లక్ష్యమని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ ఆత్మీయ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజనులు, ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్రహాలకు సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం గిరిజనులను, ఆదివాసీలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. పోడు భూములు పంచిన తర్వాత అసలు భూములు లేని గిరిజనులను తేలుద్దాం. ఆ లెక్కను చూసిన తర్వాత దళితబంధు మాదిరిగా గిరిజన బంధును కూడా అమలు చేయబోతున్నాం. భూమి, భుక్తి లేకుండా, ఎలాంటి ఆధారం లేని వారికి గిరిజన బంధును తన చేతుల మీదుగా ప్రారంభిస్తాను. సాధించుకున్న స్వరాష్ట్రంలో కులం మతం జాతి అనే బేధం లేకుండా జీవించాలి. ఈ దేశానికి మనం వెలుగు దివిటీలం కావాలి. అవినీతి రహితంగా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.