నల్లగొండ : కేంద్రం అవలంభించే విధానాల వల్ల విద్యుత్, నీటి సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కింద మన తెలంగాణను గుర్తు చేసుకోండి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పచ్చబడ్డది అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలాగే దేశాన్ని తయారు చేయాలని పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ. మునుగోడు ప్రజలకు ఇదో గొప్ప అవకాశం. చరిత్రలో సువర్ణ అవకాశం ఈ మునుగోడుకే దక్కింది. బీఆర్ఎస్కు పునాది రాయి పెట్టే అవకాశం మీకే దక్కింది. సిద్దిపేట ప్రజలు నన్ను తెలంగాణ పోరాటానికి పంపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను. మునుగోడు విజయంతోనే దేశం బాగుపడుతది. మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటాను. మీకు అండదండగా ఉంటానని కేసీఆర్ తేల్చిచెప్పారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలే. ఎవరు చేయాలి ? ఆపుతున్నది ఎవరు? ఒక రాష్ట్రం ఏర్పడితే.. ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ముళ్లు వేరుపడితే పెద్దలు ఏం చేస్తరు? ఇది నీదిరా.. గిది నీదిరా అని పంచుతరు? ఎనిమిదేళ్లవుతున్నది మహత్తరమైన ఘనత వహించిన బీజేపీ పార్టీకి, ప్రధాని మోదీకి ఎనిమిదేళ్లు చాలలేదా? మా వాటా ఇవ్వడానికి.. ఎందుకివ్వవు మోదీ? నోరు పెగలదు.. నోరు తెరవదు. నేను మహామొండి మీకు తెలుసు. మునుగోడులోని ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి.. తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ కోరుతున్నారని.. ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారు.