హైదరాబాద్ : గత ప్రభుత్వాలు ఆదివాసీలను ఓటుబ్యాంకుగా చూసి రాజకీయాలు చేస్తే, గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఆదివాసీల సంస్కృతి పరిరక్షిస్తూ, సంక్షేమానికి పాటుపడుతూ, అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు పేర్కొన్నారు. అటవీ బిడ్డల జీవన విధానానికి ప్రతీకగా, అడవితో తాము మమేకమైన అనుబంధాన్ని గుర్తు చేసే విధంగా హైదరాబాద్ వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగిందన్నారు.
మాసబ్ ట్యాంకులోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో ఆదివాసీల గుస్సాడి, దింసా నృత్యాలతో కోళాహాలంగా, కన్నుల పండుగగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి సత్యవతి రాథోడ్, ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఆదివాసీలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల జీవన ప్రమాణాలను పెంచేందుకు కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివాసీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. గడిచిన ఏడేండ్లుగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందివ్వాలని ప్రయత్నం జరుగుతుంది అని మంత్రి తెలిపారు.
గిరిజనులు రాష్ట్రంలో దాదాపు 10 శాతం ఉన్నారు. మా తండాలు, గూడాలలో మా రాజ్యం మాకు కావాలంటే ఏ పార్టీ పట్టించుకోకుండా ఓటు బ్యాంక్ గా చూస్తే సీఎం కేసిఆర్ సుమారు 4000 తండాలను గ్రామ పంచాయతీలు చేసి, అక్కడ అన్ని వసతులు కల్పిస్తూ వాటి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు అని మంత్రి సత్యవతి తెలిపారు. ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో గిరిజన బిడ్డలు గొప్పగా లబ్ది పొందుతున్నారు. ఆదివాసీ ఆవాసాలకు వెంటనే 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఆదేశించారు. దీనికి రూ. 220 కోట్లు అవసరం అంటే వెంటనే ఆ నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేశారని మంత్రి సత్యవతి గుర్తు చేశారు.
గిరిజన గురుకులాల్లో చదివి.. ఆయా ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో లక్షల మంది గిరిజన బిడ్డలు నాణ్యమైన విద్య అభ్యసిస్తున్నారు. స్పోర్ట్స్ కోసం ప్రత్యేక కాలేజీలు ఉన్నాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ గిరిజనుల కోసం ప్రత్యేక ఐఏఎస్ స్టడీ సర్కిల్ కూడా ఉంది. ఆశ్రమ పాఠశాలలను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియానికి తీసుకురావాలి అని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.