హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): మినీ మున్సిపోల్స్లో అన్నింటినీ క్లీన్స్వీప్ చేసిన టీఆర్ఎస్.. తన పట్టును మరింత పెంచు కొన్నది. గతంలోకంటే అత్యధిక డివిజన్లు, వార్డులను కైవసం చేసుకుని సత్తా చాటింది. కొత్త మున్సిపాలిటీలనూ తన ఖాతాలోనే వేసుకున్నది. 2016లో జరిగిన మినీ మున్సిపోల్స్లో టీఆర్ఎస్ అన్ని మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్నది. ఈసారి కూడా వాటిని కైవసం చేసుకుంటూనే స్థానాలను గణనీయంగా పెంచుకున్నది. గతానికి కంటే ఎక్కువ సీట్లను సాధించింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లోనూ విజయఢంకా మోగించింది. జడ్చర్లలో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించింది.
హైదరాబాద్ తర్వాత పెద్దనగరంగా గుర్తింపు పొందిన వరంగల్ మేయర్ స్థానాన్ని వరుసగా రెండోసారి కైవసం చేసుకున్నది. ఖమ్మం కార్పొరేషన్లో కొత్తగా పెరిగిన పది డివిజన్లనూ కారు ఖాతాలోనే వేసుకున్నది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ సీట్లు, ఓట్లను పెంచుతూ ప్రజలు తీర్పుఇస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని స్పష్టంగా వ్యక్తంచేస్తున్నారు. తమకు కేసీఆర్పై, టీఆర్ఎస్ ప్రభుత్వం అభిమానం పెరిగిందని, ఆయన పరిపాలన, నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకురుతుందని ఓట్ల ద్వారా మరోసారి చాటి చెప్పారు.