కమలాపూర్, సెప్టెంబర్ 26: తాను పేదిం టి బిడ్డనని, ఒకసారి అవకాశమిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తానని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గోపాల్పూర్, మాదన్నపేట, నేరెల్ల గ్రామాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్కు మహిళలు మంగళహారతులు, కోలాటలు, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేదల కోసం ప్రభుత్వం నాలుగు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఈటల రాజేందర్ ఒక్కటి కూడా కట్టియ్యకుండా పదవికి రాజీనామా చేసి బాధ్యత నుంచి తప్పుకున్నాడని విమర్శించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్ ఆరు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కూడా కట్టియ్యనోడు మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తాడో ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు. బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలను నమ్మొద్దని ఆయన కోరారు.