హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి).. రాజ్యసభ స్థానానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను గాయత్రి రవి సమర్పించారు. నామినేషన్ దాఖలు కంటే ముందు గన్పార్కులోని అమరవీరుల స్థూపానికి రవి నివాళులర్పించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు రవి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీ తాత మధు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.