నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించాయి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కవితపై అభాండాలు వేస్తే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నాయి. అర్వింద్ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు పలుచోట్ల నిరసన వ్యక్తం చేశారు.
జగిత్యాలలో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహిస్తున్న నాయకులు
నిజామాబాద్ ధర్నాచౌక్, నల్లగొండ, సిరికొండ, జగిత్యాల, వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. వరంగల్లో జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ అర్వింద్ ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు. కొందరు ఇంట్లోకి వెళ్లి కిటికీ ఆద్దాలు పగులగొట్టి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు చేరుకొని ఆందోళన చేస్తున్న మన్నె గోవర్దన్రెడ్డి, విద్యార్థి సంఘం నాయకులు బాలరాజ్, రామచందర్ తదితరులను పోలీస్స్టేషన్కు తరలించారు. పసుపు రైతులను మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్న అర్వింద్కు ఎమ్మెల్సీ కవిత గురించి మాట్లాడే హక్కు లేదని ఈ సందర్భంగా నాయకులు చ్చరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును పక్కదోవ పట్టించేందుకు మతిలేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బోధన్లో ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెలంగాణ జాగృతి నాయకులు
హైదరాబాద్లో ఎంపీ అర్వింద్ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న జాగృతి, టీఆర్ఎస్ నాయకులు
కవితకు మంత్రి వేముల సంఘీభావం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సంఘీభావం తెలిపారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లి మాట్లాడారు.
దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు
ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన తల్లి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 50 మంది దాకా ఇంట్లోకి ప్రవేశించి కర్రలు, రాళ్లతో దాడి చేశారని.. అడ్డుకొనేందుకు యత్నించిన పనిమనిషి సత్యవతి, సెక్యూరిటీగార్డు రమణ గాయపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అర్వింద్ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎంపీ అర్వింద్ చీటర్
చీటింగ్ చేసి ఎంపీగా గెలిచిన అర్వింద్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేయడం కాదు..దమ్ముంటే పదవికి రాజీనామా చేసి పొటీ చేయాలి. అర్వింద్కు భవిష్యత్లో పుట్టగతులుండవు.
– షకీల్, బోధన్ ఎమ్మెల్యే
వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకోం
ఎమ్మెల్సీ కవితపై వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకునేది లేదు. ఎంపీ స్థానంలో ఉండి అవమానకరంగా మాట్లాడటం దిగజారుడు చర్య. రాష్ర్టానికి పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన వ్యక్తి ఆయన. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితకు అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలి.
– గొంగిడి సునీత, ప్రభుత్వ విప్
బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అర్వింద్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తండ్రీబిడ్డల అనుబంధాన్ని అవహేళన చేసేలా చిల్లర రాజకీయాలు చేయడం అత్యంత హేయం. అర్వింద్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మహిళాలోకం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
– గుండు సుధారాణి, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు
నాలుక కోస్తాం
ఎంపీ ధర్మపురి అర్వింద్ అత్యంత నీచంగా మాట్లాడుతూ రాజకీయాలను దిగజారుస్తున్నారు. తెలంగాణకు పసుపు బోర్డు తెస్తానని ఓట్లు వేయించుకొని హామీని గాలికి వదిలేసిన ఘనత ఆయనది. ఎమ్మెల్సీ కవితపై ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటు. అర్వింద్ తన పద్ధతి మార్చుకోకపోతే నాలుక కోస్తాం.
– శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ
అబద్ధాలకు కేరాఫ్ అర్వింద్
బీజేపీ ఎంపీ అర్వింద్ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్. అవగాహన రాహిత్యానికి నిలువెత్తు రూపం. వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టి, రైతులను కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది. కవితపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఖబడ్దార్.
– వై సతీశ్రెడ్డి, తెలంగాణ రెడో చైర్మన్
నోరు అదుపులో పెట్టుకోవాలి
రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక అర్వింద్ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై నోటికొచ్చినట్టు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నోరు పారేసుకోకుండా అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా రోడ్ల మీదుంటే ఇంట్లో దాక్కొన్న వ్యక్తి అర్వింద్.
– గ్యాదరి బాలమల్లు, టీఎస్ఐఐసీ చైర్మన్
మతిస్థిమితం లేకే అభాండాలు
బీజేపీ ఎంపీ అర్వింద్కు ఓటమి భయం పట్టుకొన్నది. మతిస్థిమితం తప్పి కవితపై అభాండాలు వేస్తున్నాడు. ఆడబిడ్డలను అగౌరవపర్చడం బీజేపీ వారికి అలవాటైంది. నీ ఇంటి మీద కాదు..నీపై దాడి చేసే పరిస్థితి వస్తుంది. తమ మాట వినని రాష్ర్టాలు, ప్రజాప్రతినిధులను కేంద్రం టార్గెట్ చేస్తూ ఈడీ, ఐటీ, సీబీఐలను ప్రయోగిస్తున్నది.
– గజ్జెల కాంతం, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్
పసుపు బోర్డు ఏమైంది ?
నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు తెస్తానన్న అర్వింద్కు ఏండ్లు గడుస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఎమ్మెల్సీ కవిత కృషితో నిజామాబాద్కు స్పైస్ బోర్డు వచ్చింది. ఏఐసీసీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపితే దాన్ని రాజకీయం చేయడం అత్యంత నీచం.
– పిడమర్తి రవి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్