హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల బదిలీల కోసం స్పౌజ్ కోటాలో 13 జిల్లాలకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకొన్నారు. అంతర్ జిల్లాల బదిలీల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు వేల దరఖాస్తులు రాగా, అందులో సగం 13 జిల్లాలకు సంబంధించినవే ఉన్నాయి. వాటిలో తొలి ఐదు స్థానాల్లో హనుమకొండ, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. పాత జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాలకు బదిలీ కోరుతూ ఎక్కువ మంది దరఖాస్తు చేసుకొన్నారు. పలు జిల్లాల్లో ఉన్న పోస్టులకు మించి దరఖాస్తులు రావడంతో అందరినీ సర్దుబాటు చేయడం అధికారులకు సమస్యాత్మకంగా మారింది. దీంతో ఆయా జిల్లాల్లో ప్రాధాన్య క్రమంలో కొందరిని సర్దుబాటు చేసినట్టు తెలుస్తున్నది. దీంతో 13 జిల్లాల్లో స్పౌజ్ కోటాను బ్లాక్ చేసినట్టు సమాచారం. ఆయా జిల్లాలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా, బయటకు వెళ్లేవారి సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఆయా జిల్లాలకు కొత్తగా ఎవరైనా రావాలంటే ఇకపై కష్టమేనని, పరస్పర బదిలీల ద్వారా మాత్రమే సర్దుబాటు చేయగలమని అధికారులు భావిస్తున్నారు.