(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): బంగారం కొనుగోలు చేయొద్దని, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలంటూ ప్రధాని మోదీ ఆదివారం చేసిన తొమ్మిది సూచనలపై సోషల్మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు. సహేతుక ప్రత్యామ్నాయాలు చూయించకుండా, దీర్ఘకాల ప్రభావాన్ని అంచనా వేయకుండా ప్రధాని అసంబద్ధంగా ప్రసంగించారంటూ చురకలు అంటిస్తున్నారు. ఈ మేరకు మోదీ సూచించిన 9 సూచనలను సోషల్మీడియా వేదికగా ఎండగడుతున్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి ప్రజా రవాణాను వినియోగించాలంటూ మోదీ చేసిన సూచనలపై స్పందించిన నెటిజన్లు.. దేశ జనాభాకు తగినంతగా ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడ ఉన్నదని నిలదీస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై స్పందిస్తూ.. వాటి ధర ఎంతో ఎక్కువగా ఉన్నదని, ఛార్జింగ్ స్టేషన్లు కూడా తగినన్ని అందుబాటులో లేవని గుర్తు చేస్తున్నారు.
ఏడాది పాటు బంగారం కొనొద్దన్న సూచనపై మాట్లాడుతూ.. ఆ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న రెండు కోట్ల కుటుంబాల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. యూరియా, ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్న సూచనపై స్పందిస్తూ.. పంట దిగుబడి తగ్గి ఆహార సంక్షోభం తలెత్తితే బాధ్యులు ఎవరని? గిట్టుబాటు లేక రైతు దివాలా తీస్తే, పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వర్క్ఫ్రమ్హోమ్ను ప్రోత్సహించాలన్న ప్రతిపాదనపై మాట్లాడుతూ.. అప్పుడు ఆఫీసు స్పేస్, లీజు, ఇండ్ల ధరలు, ఐటీపై ఆధారపడి బతుకుతున్న చిరువ్యాపారుల సంగతేమిటని నిలదీస్తున్నారు. ఇంట్లో వాడే సరుకుల్లో విదేశీ వస్తుజాబితాను తగ్గించుకోవాలన్న సూచనపై స్పం దిస్తూ.. మనం రోజూవాడే వస్తువుల్లో 70 శాతం అవే ఉన్నాయని, వాటిని కాదని ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. చివరగా.. విదేశీ టూర్లను తగ్గించుకోవాలన్న మోదీ ప్రతిపాదనపై స్పందిస్తూ.. స్వతంత్ర భారత చరిత్రలో ప్రధాని మోదీ చేసినన్ని విదేశీ పర్యటనలు (78 దేశాలు.. 99 టూర్లు) మరో ప్రధాని ఎవరూ చేయలేదని, అలాంటి వ్యక్తి విదేశీ టూర్ల గురించి మాట్లాడటమేంటని సెటైర్లు వేస్తున్నారు.