హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యరంగం అన్ని విభాగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. అప్పటివరకు తాను రిలాక్స్ అవనని, వైద్యశాఖ సిబ్బందిని రిలాక్స్ కానివ్వనని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ వైద్యులు, సిబ్బందికి మంత్రి హరీశ్రావు అవార్డులు అందజేసి, సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఒకే చోట కుటుంబంలా కలవటం సంతోషంగా ఉన్నదని అన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. వైద్యశాఖ బడ్జెట్ను రూ.6,295 కోట్ల నుంచి రూ.11,440 కోట్లకు పెంచారని గుర్తు చేశారు. దీంతో తలసరి ఖర్చు గత ఏడాది రూ.1,698 ఉంటే, ఈసారి ఏకంగా రూ.3,092కి పెరిగిందని, ఇది దేశంలోనే అత్యధికమని వెల్లడించారు. తెలంగాణ వైద్యారోగ్య రంగం మెరుగుపడిందని కేంద్రం అనేక అవార్డులు, నివేదికల రూపంలో చెప్పిందని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మూడో స్థానం, క్వాలిటీ అష్యూరెన్స్లో మొదటి స్థానం, ఎస్ఎన్సీయూలో రెండో స్థానం, టీబీ నోటిఫికేషన్లో మొదటి స్థానం, టీబీ నిర్మూలనలో ఐదో స్థానంలో ఉన్నామని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా వెల్నెస్ విభాగంలో రెండు అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు.
పనితీరు మెరుగుపడాల్సిందే
ప్రజారోగ్య రంగంలో సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని, అందుకే అన్ని స్థాయిల్లో వసతులు, పరికరాలు పెంచామని మంత్రి చెప్పారు. డైట్, శానిటేషన్ చార్జీలు పెంచామని, సిబ్బంది కొరత లేకుండా జిల్లా స్థాయిలోనే నియామక అధికారం ఇచ్చామని, భవనాల నిర్వహణ కోసం కూడా నిధులు ఇస్తున్నామని తెలిపారు. వసతులు పెరిగినందున, సిబ్బంది పనితీరు కచ్చితంగా మెరుగుపడాలని స్పష్టం చేశారు. బాగా పని చేసేవాళ్లను గౌరవిస్తామని, చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో 54 శాతం డెలివరీలు అవుతున్నాయి. 70-75 శాతానికి పెరగాలన్నే నా లక్ష్యం’ అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో సీ-సెక్షన్లపై ఆడిట్ నిర్వహిస్తామని, వాటిని తగ్గించకపోతే గైనకాలజిస్ట్లను డీబార్ చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతామని తెలిపారు.
తెలంగాణలో డబ్ల్యూహెచ్వో థీమ్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్వో ‘మన ప్లానెట్.. మన ఆరోగ్యం’ థీమ్ను ఇచ్చిందని, ఇందులో భాగంగా పలు లక్ష్యాలు నిర్ణయించిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. హరితహారం ద్వారా స్వచ్ఛమైన గాలి, మిషన్ భగీరథ ద్వారా శుభ్రమైన నీరు, ఆర్థిక ఆరోగ్యం, పల్లె, పట్టణ ప్రగతి, డబుల్ బెడ్రూం ఇండ్ల ద్వారా నివాస యోగ్యమైన స్థలం, ఆహార భద్రత, స్వచ్ఛ సర్వేక్షణ్ ద్వారా భూమిని కాపాడుతున్నామని స్పష్టం చేశారు.
కన్న తల్లుల్లా గాంధీ, ఉస్మానియా
ప్రతి వ్యవస్థలో మంచి, చెడు ఉంటాయని మంత్రి హరీశ్ తెలిపారు. నిజం గడప దాటకముందే అబద్ధం ఊరంతా చుట్టి వచ్చినట్టు, వైద్యారోగ్య శాఖలో మంచి బయటకు రావడం లేదని, చెడు మాత్రమే ప్రచారం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ, ఉస్మానియా వంటి దవాఖానలు కన్నతల్లిలా ప్రజలకు సేవ చేస్తున్నాయని తెలిపారు. పిల్లలు ఎలా ఉన్నా తల్లి బాగా చూసుకొన్నట్టే.. రోగి ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అవి అక్కున చేర్చుకొంటున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ వైద్యరంగంలో జరిగే మంచిని కూడా ప్రచారం చేసుకోవాల్సి ఉన్నదని, అందుకే ఆశ మొదలు అన్ని స్థాయిల్లో మంచిగా పనిచేసే సిబ్బందిని సన్మానించాలని నిర్ణయించామని అన్నారు. తెల్లకోటుకు మరింత గౌరవం పెరగాలని ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఒక్క సూపర్ స్పెషాలిటీ దవాఖాన కూడా లేదని, ఇప్పుడు హైదరాబాద్ నాలుగువైపులా 4 టిమ్స్, నిమ్స్లో 40 ఎకరాల స్థలంలో 2 వేల పడకలతో ఒక హాస్పిటల్, వరంగల్లో హెల్త్ సిటీ, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.