హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) ఉస్మానియా యూనివర్సిటీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గిరిజనులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం (జీఎస్ఎస్) నేతలు పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంఘం నేత డాక్టర్ శంకర్నాయక్ మాట్లాడారు.
రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి కేసీఆర్ సర్కారు పెద్దపీట వేసిందని, తండాల్లో తమ రాజ్యం కావాలన్న దశాబ్దాల కలను కేసీఆర్ నిజం చేశారని కొనియాడారు. రాష్ట్రంలోని 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారని పేర్కొన్నారు. ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారని ప్రశంసించారు.
సేవాలాల్ మహరాజ్, కుమ్రంభీం జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంతోపాటు బంజారా భవన్లను నిర్మించి ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేశారని కొనియాడారు. గిరిజనులమంతా ఏకమై బీఆర్ఎస్కే ఓటేద్దామని, కేసీఆర్ను మూడోసారి సీఎంను చేద్దామని కోరారు.
సమావేశంలో జీఎస్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ రాజునాయక్, శ్రీనునాయక్, చంటి మురళీజాదవ్, సురేశ్నాయక్, తేజనాయక్, శివనాయక్, నవీన్ నాయక్, మోహన్నాయక్, నరేశ్, అనిల్, శేఖర్, మురళి తదితరులు పాల్గొన్నారు.