హైదరాబాద్/నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమశాఖ ఇన్చార్జి సూపరింటెండెట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ) కే జగజ్యోతి అవినీతి చిట్టా పెద్దగానే ఉన్నది. ఆమె ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు వజ్ర వైడూర్యాలతోపాటు తీరొక్క నగలు, వడ్డాణాలు, బంగారు గొలుసులు, రత్నాలు పొదిగిన ఆభరణాలు.. ఇలా మూడున్నర కిలోల ఆ భరణాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని గిరిజనభవన్లో రూ.84 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన జగజ్యోతి ఇంట్లో సోమ, మం గళవారాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ సమీపంలో వెంకటసాయి అపార్ట్మెంట్లో తనిఖీలు చేపట్టగా సుమారు రూ.65.50 లక్షల నగదు, రూ.1.51 కోట్ల విలువైన 3.6 కిలోల బంగారు ఆభరణాలు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, అపార్ట్మెంట్ ఫ్లాట్లకు సంబంధించిన ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆమె దగ్గరున్న మొత్తం ఆస్తుల విలువ రూ.15 కోట్లకుపైగానే ఉంటుందని పేర్కొన్నారు.
గుండెనొప్పంటూ హైడ్రామా..
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ మండలం తాటివర్రుకు చెందిన జగజ్యోతి ఉద్యోగరీత్యా మెహిదీపట్నంలో ఉంటున్నది. ఆమె భర్తది నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు. ఏసీబీ అధికారులు తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం మొదలూ.. నానా హంగామా సృష్టించింది. ఏసీబీ అధికారులు ఆమెను రిమాండ్కు తరలించేందుకు సిద్ధమవుతుండగా ఛాతీనొప్పంటూ నాటకమాడింది. హుటాహుటిన ఆమెను ఉస్మానియా దవాఖానకు తరలించి అన్ని పరీక్షలు చేయించారు.
అన్ని పరీక్షల్లో నార్మల్గా రిపోర్టు రావడంతో కోర్టుకు తరలించే ప్రయత్నం చేశారు. మళ్లీ కాసేపటికే గుండెనొప్పి అంటూ చెప్పడంతో మళ్లీ ఆమెను దవాఖానకు తరలించి గుండె పరీక్షలు నిర్వహించారు. అవి కూడా నార్మల్ అని తేలడం, మొత్తానికి ఆమె నాటకమంతా బయటపడటంతో అరెస్టుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. బుధవారం జగజ్యోతిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించనున్నారు.