జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకున్న జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా సతీమణి, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇళా త్రిపాఠిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. మంగళవారం భూపాలపల్లిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి సందర్శించి, అదనపు కలెక్టర్ దంపతులను పలుకరించారు. వారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు కలెక్టర్ దంపతులు ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానను ఎంచుకోవడం ప్రశంసనీయమని ఆమె కొనియాడారు. అనంతరం కలెక్టర్ దంపతులకు కేసీఆర్ కిట్ను మంత్రి అందజేశారు.
ట్విట్టర్లో మంత్రి హరీశ్రావు అభినందన
ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఆమె భర్త భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా దంపతులను వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు ట్విట్టర్ ద్వారా అభినందించారు. ప్రజల్లో నమ్మకం పెంచే దిశగా ప్రభుత్వ దవాఖానను ఎంపిక చేసుకున్నందుకు కలెక్టర్ దంపతులు ఆదర్శప్రాయులని మంత్రి కొనియాడారు.