హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని 83 గిరిజన రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మార్చి 27న నిర్వహించిన టీటీడబ్ల్యూఆర్జేసీ సెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్లో ఈ ఫలితాలను విడుదల చేశారు. tgtwgurukulam.gov.in వెబ్సైట్ నుంచి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 8,200 సీట్లకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 26,042 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షలో ఎకువ మారులు సాధించిన విద్యార్థులకు ‘ప్రతిభ’ కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయని, ఆ కళాశాలల్లో 1,140 సీట్లు ఉన్నాయని వివరించారు.
ఈ సీట్లన్నీ ఎస్టీ విద్యార్థులకే కేటాయిస్తారని, ‘ప్రతిభ’ కళాశాలల్లో చేరే విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుందని చెప్పారు. మిగిలిన జనరల్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్, కామర్స్ కోర్సులతోపాటు వృత్తి విద్య కోర్సులు అందుబాటులో ఉంటాయని, ఈ కాలేజీల్లోని ప్రతి గ్రూపులో ఒక్కో సీటును ఇతరులకు రిజర్వు చేసినట్టు తెలిపారు. గిరిజన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తున్నదని గుర్తు చేశారు. వీటిని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రోస్, అదనపు కార్యదర్శి సర్వేశ్వర్రెడ్డి, ఉప కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు