హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు విస్మరణకు గురైన గిరిజన, ఆదివాసీ సాహిత్యాన్ని వెలుగులోకి తేవాల్సిన బాధ్యత తెలుగు సాహిత్యకారులపై ఉన్నదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. గిరిజన, ఆదివాసీ సాహిత్యం లేకుండా తెలుగు సాహిత్యం సమగ్ర సాహిత్యం కాదని అన్నారు. డాక్టర్ సూర్యధనంజయ్, రమేశ్ కార్తీనాయక్ సంపాదకత్వంలో వెలువడిన ‘కేసులా’ గ్రంథ పరిచయ సభ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో శనివారం నిర్వహించగా, జూలూరు గౌరీశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
గిరిజన, ఆదివాసీల చరిత్ర మహోన్నతమైనదని, వారి కళలు, సంస్కృతి, భాష, నాగరికత, జీవనవిధానం, కట్టుబాట్లు, సంప్రదాయాలు, దుస్తులు, వేషధారణ తదితర అనేక విషయాలు మౌఖిక సాహిత్యంలో నిక్షిప్తమై ఉన్నాయని వెల్లడించారు. వాటిని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరమున్నదని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర, తెలంగాణ సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కేసులా కథల సంకలనం సంపాదకులు సూర్య ధనంజయ్, రమేశ్ కార్తీక్నాయక్, గ్రంథ సమీక్షకురాలు జ్యోతి, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వర్రెడ్డి, ప్రముఖ విమర్శకులు కేపీ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.