సిర్పూర్(యూ) ఏప్రిల్ 22 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల జైనూర్ మండలం పానపటార్ ఆశ్రమ పాఠశాలలో బాలుడి మృతి ఘటన మరువక ముందే సిర్పూర్(యూ) మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో విద్యార్థిని మృతిచెందిన ఘటన జిల్లా వాసులను కలచివేస్తున్నది. విద్యార్థిని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్(యూ) మండలం బాబ్జిపేటకు చెంది న ఆదివాసీలు కోట్నాక సుంగు, జంగుబాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు గంగాబాయి(14) మహాగాంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. మంగళవారం అర్ధరాత్రి తీవ్రంగా జ్వరం రావడంతో గంగాబాయి స్పృహ కోల్పోయింది. బుధవారం ఉదయం గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రంభాబాయి, సిబ్బంది, ఏఎన్ఎం అంబులెన్స్లో జైనూర్ దవాఖానకు తరలించారు.
వైద్యులు పరీక్షించి అప్పటికే విద్యార్థిని మృతి చెందిందని తెలిపారు. ఉదయం తన కూతురు ఆరోగ్యం బాగాలేదని పాఠశాల నుంచి ఫోన్ వచ్చిందని, ఇ ప్పుడు దవాఖానలో శవాన్ని చూపిస్తున్నారని తండ్రి సుంగు గుండెలు బాదుకుంటూ రోదించడం చూసి అక్కడున్నవారు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థిని మృతికి పాఠశాల సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి కనకయాదవరావు, బీఆర్ఎస్ నాయకులు దవాఖాన ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీటీడీవో రమాదేవి, ఐటీడీఏ ఏజెన్సీ డీఈవో గోడం చందర్, అధికారులు వచ్చి విద్యార్థిని తండ్రి సుంగుకు మండలంలోని పంగిడి ఆశ్రమ పాఠశాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకపత్రం అందించి, కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు.