TREI-RB | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని అన్ని క్యాటగిరీల్లో కలిపి నోటిఫై చేసిన పోస్టుల్లో ఏకంగా 404 పోస్టులను ట్రిబ్ నింపలేదు. వీటిలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులే లేరని సమాధానమిస్తున్నది. ఇప్పుడు భర్తీ చేసిన పోస్టుల్లోనూ సగానికిపైగా ఖాళీ అయ్యే అవకాశమున్నదని తెలుస్తున్నది. అందుకు ప్రధాన కారణం డీఎల్, జేఎల్, పీజీటీ పోస్టులకు కామన్ పేపర్ పెట్టినా డీసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం ఒకటయితే, రిలింక్విష్మెంట్ ఆప్షన్ను అమలు చేయడం మరొకటని అర్థమవుతున్నది.ఆనిబంధనలు అమలు చేయాలని అభ్యర్థులు పట్టుబడుతున్నా, ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అంటూ ట్రిబ్ వెల్లడిస్తున్నది. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం గురుకుల పోస్టులను పూర్తిగా భర్తీ చేయకుండా వెకెన్సీలను చూపి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తున్నదనే అభ్యర్థుల వాదనకు ఇది బలం చేకూరుతున్నది. టీఎస్పీఎస్సీ జేఎల్ రిజల్ట్ వస్తే గురుకులాల్లో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో తొమ్మిది క్యాటగిరీల్లో పీజీటీ 1,276, టీజీటీ 4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2,876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టులు.. ఇలా మొత్తం 9,210 పోస్టుల భర్తీకి ట్రిబ్ గత ఆగస్టులోనే రాత పరీక్షను నిర్వహించింది. అందులో కోర్టు కేసుల నేపథ్యంలో మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులను మినహాయించి మిగతా పోస్టుల భర్తీని చేపట్టింది. వాటిని కూడా బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయకపోవడం గమనార్హం.
నోటిఫైడ్ చేసిన 8,708 పోస్టుల్లో 8,304 పోస్టులనే ట్రిబ్ నింపింది. 404 పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు. అందుకు ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరని ట్రిబ్ చెప్తున్నది. డిగ్రీ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39 నోటిఫైడ్ చేశారు. అందులో 25 పోస్టులకే అభ్యర్థులను ఎంపిక చేశారు. జూనియర్ కాలేజీల్లోని ఉర్దూ లెక్చరర్ 50 పోస్టులకుగాను 1ః2 జాబితాలోకి వచ్చిన వాళ్లు 59 మంది కాగా, 1ః1 జాబితాలో 27 మంది అభ్యర్థులే ఎంపిక చేశారు. టీజీటీ ఊర్దూలో 120 పోస్టులకుగాను 1ః2లో వెరిఫికేషన్కు 100 మంది జాబితానే ప్రకటించారు. అందులో 49 మందికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇదే తరహాలో జేఎల్ బొటనీలో 204 పోస్టులు ఉండగా, 160 పోస్టులనే నింపారు.మిగిలిన పోస్టులు వెకెన్సీ పెట్టారు.
డీఎల్, జేఎల్ పరీక్షకు, పీజీటీ పోస్టులకు సమాన విద్యార్హతలున్నాయి. రాత పరీక్షలో జనరల్ సైన్స్ పేపర్ను కామన్గా పెట్టారు. ఉద్యోగ ఎంపికలో ఈ పేపరే ప్రధానపాత్ర పోషించేది. జేఎల్, పీజీటీ పోస్టులకు జీఎస్, మెథాడాలజీ తదితర అన్ని పేపర్లను కామన్గానే పెట్టారు. రాతపరీక్ష మార్కులు జేఎల్, పీజీటీ పోస్టులకు సమానమే. అంటే జేఎల్ పోస్టుకు ఎంపికైన ప్రతి అభ్యర్థి పీజీటీ పోస్టుకు సైతం ఎంపికైనట్లే. డెమో మార్కుల్లో తేడా వచ్చినా అతి స్వల్పమనే చెప్పాలి. కామన్ పేపర్ ఉండటం వల్లే ఈ సారి ఫలితాల్లో మూడువేల మందికిపైగా అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులకు ఎంపికయ్యారు.
తొలుత పీజీటీ, ఆ తర్వాత డీఎల్, జేఎల్, టీజీటీ పోస్టుల భర్తీని ట్రిబ్ నిర్వహించింది. రాత పరీక్ష మార్కుల ఆధారంగా 1ః2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలోని అభ్యర్థుల సర్టిఫికెట్లు, అర్హతలను పరిశీలించి పోస్టులను భర్తీ చేసింది. చాలా మంది అభ్యర్థులు తొలుత పీజీటీ నియామక పత్రాలను, తర్వాత డీఎల్, ఆపై జేఎల్ నియామక పత్రాలను అందుకున్నారు. ఇప్పుడు వారందరూ ఏదో ఒక పోస్టును మాత్రమే ఎంపిక చేసుకోవాల్సిందే. అప్పుడు భర్తీ 8,304 పోస్టుల్లోనూ దాదాపు 3 వేలకుపైగా పోస్టులు మళ్లీ ఖాళీగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది. డిసెండింగ్ ఆర్డర్లో అంటే డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ క్రమంలో పోస్టుల భర్తీని చేపట్టి ఉంటే ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడి ఉండేది కాదు.
ఒక అభ్యర్థి ఉద్యోగంలో జాయినై మధ్యలో వదిలిపెడితే ఆ ఉద్యోగాన్ని బ్యాక్లాగ్ పోస్టుల జాబితాలో వేయాలని, నాన్ జాయినింగ్ పోస్టులను బ్యాక్లాగ్ జాబితాలో వేయకూడదని, తదుపరి మెరిట్ అభ్యర్థికి ఆ పోస్టును కేటాయించాలని సుప్రీంకోర్టు అనేక తీర్పులు వెలువరించింది. ఇటీవల నింపిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గురుకుల ప్రిన్సిపాల్స్, లైన్మెన్ పోస్టుల భర్తీనే ఉదాహరణ. ఈ వెయిటింగ్ జాబితాను అమలు చేయడం వల్ల అభ్యర్థులు జాయిన్ కానీ పోస్టులను తదుపరి మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులతో నింపే అవకాశముంది. ఫలితంగా బ్యాక్లాగ్లు లేకుండా నోటిఫికేషన్లో జారీ చేసిన పోస్టులన్నింటినీ నింపేయవచ్చు. కానీ, ట్రిబ్ మాత్రం నోటిఫికేషన్లోని పేరా 5(1)లో జీవో 81, 1997 ప్రకారం వెయిటింగ్ లిస్టు విధానం లేదని తేల్చిచెప్పింది. భర్తీ కాని, అభ్యర్థులు జాయినింగ్ కాని ఖాళీలను క్యారిఫార్వడ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ స్వార్థపూరిత కుట్ర ఫలితంగానే ఇప్పుడు తాము నష్టపోతున్నామని గురుకుల అభ్యర్థులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలుపుతూ బాధిత అభ్యర్థులు ధర్నాలకు దిగుతున్నారు. నియామక పత్రాలను అందించి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తమను కాంగ్రెస్ సర్కార్ ఆగం చేసిందని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, బ్యాక్లాగ్లు లేకుండా చూసి తమకు న్యాయం చేయాలని 1ః2 మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు కోరుతున్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్కు చెప్తున్నామని హెచ్చరిస్తున్నారు.