హైదరాబాద్, ఏప్రిల్4 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణ ప్రారంభంకానున్నది. న్యాయవిచారణ బాధ్యతలను పశ్చిమ బెంగాల్కు చెందిన విశ్రాంత న్యాయమూర్తి పీసీ ఘోష్కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ ఈ వారాంతంలో రాష్ర్టానికి రానున్నారని సమాచారం. న్యాయవిచారణ కోసం బీఆర్కే భవన్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల ప్లానింగ్, డిజైన్, నిర్మాణ లోపాలు, కాంట్రాక్టుల అప్పగింత తదితర అంశాలపై విచారణ చేసి 100 రోజుల్లో నివేదికను అందజేయాలని జస్టిస్ పీసీ ఘోష్కు మార్గదర్శకాలను జారీ చేసిన విషయం విధితమే. ఇటీవల ఇరిగేషన్శాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా, ఈఎన్సీ నాగేందర్రావు ప్రత్యేకంగా కలకత్తా వెళ్లి జస్టిస్ పీసీ ఘోష్ను కలిసి ప్రభుత్వ మార్గదర్శకాలను అందించారు. ఈ సందర్భంగా త్వరలోనే రాష్ర్టానికి వస్తానని ఇరిగేషన్ అధికారులకు జస్టిస్ పీసీ ఘోష్ వెల్లడించారు. వరుసగా వస్తున్న ప్రభుత్వ సెలవులు ముగిసిన అనంతర వారంలో తెలంగాణకు రానున్నట్లు సమాచారం. మొత్తంగా మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఇరిగేషన్ అధికారులతో సమావేశం కావడంతో పాటు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారని సమాచారం. న్యాయవిచారణ కోసం నియమితులైన జస్టిస్ పీసీ ఘోష్కు సహాయంగా సీనియర్ అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్, ఒక సెక్రటరీతోపాటు, చీఫ్ ఇంజినీర్స్థాయి ఇంజినీర్ అధికారులు, ఈఈలు, ఏఈఈలు, జేఈఈ, స్టెనోలు తదితర సిబ్బందిని కేటాయించడంతోపాటు, వసతి సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. సహాయ సిబ్బంది, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అధికారులు ఇప్పటికే పంపించారు.