TREIRB | పరాయోళ్ల పాలనలో చదువు‘కొనలేక’ మధ్యలో ఆపేసినోళ్లే ఎక్కువ. సొంత రాష్ట్రంలో ఎంత గరీబ్ పరిస్థితి ఉన్నోళ్లకైనా పిల్లలను చదివించడంపైనే మక్కువ. పదేండ్లలోనే ఎంత మార్పు? ఎలా సాధ్యమైందీ కూర్పు?! ఔను, మీ మదిలో మెదులుతున్న వ్యక్తిదే ఆ నేర్పు! కేసీఆర్తోనే ఈ మలుపు. వడ్డించేటోళ్లు మనోళ్లయితే బంతిలో ఏ మూలన కూసున్నా నల్లిబొక్క మన విస్తర్ల పడ్తదన్నట్టు.. తెలంగాణ ఇంటి పార్టీ పరిపాలన చేసింది కాబట్టే విద్యారంగంలో ఈ జమీన్ ఆస్మాన్ ఫరక్ వచ్చింది. కార్పొరేట్ దాడిలో చదువు మధ్యలోనే నిలిపివేయ‘బడి’న పేద బిడ్డలను గురుకులాలు అక్కున చేర్చుకున్నాయి. స్వరాష్ట్రంలో గురుకుల ఆశ్రమ విద్యా వ్యవస్థ తెచ్చిన మార్పు విజ్ఞానులకే ఎరుక!!
అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే వంటి మహనీయులు చూపిన మార్గంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న గురుకుల విద్యావిధానం నేడు యావత్తు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. అగ్రవర్ణ పేద కుటుంబాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసే ప్రక్రియను సైతం ప్రారంభించిందీ బీఆర్ఎస్ సర్కార్. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల మాదిరిగానే విద్యారంగంలోనూ తీవ్ర వివక్షకు గురైంది. ఈ నేపథ్యంలోనే స్వరాష్ట్రంలో విద్యారంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందించాలని సంకల్పించారు. తొమ్మిదిన్నరేండ్లుగా చేపట్టిన చర్యలతో ఆ దిశగా వడివడిగా బలమైన అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సత్ఫలితాలు అందుతున్నాయి. అట్టడుగు వర్గాల విద్యాభ్యున్నతికి పాటుపడుతున్నది తెలంగాణ సర్కారు. స్వరాష్ట్ర ఏర్పాటు నుంచి క్రమంగా గురుకులాల సంఖ్యను విస్తరిస్తూ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా కేవలం 293 గురుకులాలు ఉండేవి. అందులో 5-10వ తరగతి వరకు మాత్రమే విద్యనందించేవారు. ఇక ఇంటర్, డిగ్రీ గురుకుల కళాశాలల ఊసే ఎత్తలేదు ఆనాటి పాలకులు. కేవలం పోస్ట్మెట్రిక్ హాస్టళ్లను నిర్వహించేవారు. అవి కూడా అంతంతమాత్రమే. ఇక ఆయా గురుకులాల్లో వసతులూ నామమాత్రమే. దీంతో హాస్టళ్లు ఉన్నా విద్యార్థులు లేక అవి బోసిపోయే దుస్థితి. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం 2016-17 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారీగా గురుకుల పాఠశాలలను క్రమానుగతంగా విస్తరించుకుంటూ వస్తున్నది. తొలుత నియోజకవర్గానికి ఒకటి చొప్పున నెలకొల్పింది. తర్వాత 2017-18లో, 2019 లోనూ మరోసారి హాస్టళ్లను సంఖ్యను పెంచింది. ఇలా మొత్తంగా గతంలో ఉన్న గురుకులాలతో కలిపి రెసిడెన్షియల్ గురుకులాల సంఖ్యను 1,022కు పెంచింది. ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షలను ఖర్చు చేస్తున్నది. సగటున ఒక్కో గురుకులం ద్వారా 640 మంది చొప్పున ఏటా ఇప్పటికే 6.50 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నది. అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థుల కోసం 119 గురుకులాలు, మైనార్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. మొత్తం గురుకులాల్లో 564 బాలికలవే కావడం మహిళా విద్యాభివృద్ధి కోసం జరుగుతున్న కృషికి తార్కాణం. ఉమ్మడి పాలనలో ఒక్క రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కూడా అందుబాటులో లేకపోగా, నేడు 85 ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అందులోనూ బాలికలకే తొలి ప్రాధాన్యమిచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం బీఎస్సీ (ఎంపీసీఎస్), బీఎస్సీ (బీజడ్సీ), బీకాం, బీఏ కోర్సులు అందించేలా సాధారణ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక వృత్తి విద్య గురుకులాలను సైతం నెలకొల్పుతున్నది. రుక్మాపూర్లో సైనిక్ స్కూల్, భువనగిరిలో ఆర్మ్డ్ ఫోర్స్ కాలేజీ, వికారాబాద్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫిల్మ్ అండ్ మీడియా, యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్, ఫొటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ కోర్సులతో బీఏ (హానర్స్), సంగారెడ్డి కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు, హనుమకొండ, కందుకూరులో రెసిడెన్షియల్ లా కాలేజీలు, కరీంనగర్, వనపర్తిలో అగ్రికల్చర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. గురుకుల వృత్తి విద్య కళాశాలలను నెలకొల్పింది. డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. గురుకులాల్లో కొన్నింటిని ఎక్స్లెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ.. అన్నీ కలిపి మొత్తంగా 50కి పైగా సెంటర్లు ఏర్పాటు చేసింది. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఐఐటీ, జేఈఈ, నీట్తోపాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే గురుకుల విద్యార్థులు ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశివేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా, సత్వరమే ఉపాధి అవకాశాల పొందగల కోర్సులను ప్రవేశపెడుతుండడం విశేషం. గతంలో కేవలం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ కోర్సులను గ్రూప్నకు 40 చొప్పున సీట్లతో అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ అందుకు భిన్నంగా నేడు గురుకుల కళాశాలల్లో నూతన సాంకేతిక కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్మీడియట్ స్థాయిలో ఒకేషనల్లో అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, హోమ్ సైన్స్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఇక బీఎస్సీ బీజడ్సీ, ఎంపీసీ, కంప్యూటర్సైన్స్, బీఏ హెచ్ఈపీ తదితర సాధారణ కోర్సులతోపాటు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, బీబీఏ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియాలజీ, బిజినెస్ అనలిటిక్స్, జియోగ్రఫీ, డేటాసైన్స్, సోషియాలజీ, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్, డైట్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ తదితర అధునాతన కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
గురుకులాల్లో మెరుగైన విద్యను అందించడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సైతం ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. పలు ప్రతిష్టాత్మక కంపెనీలతో ఒప్పందాలను చేసుకుంటూ గురుకుల విద్యార్థులకు నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నది. ఇప్పటికే పలు ఎంఎన్సీ కంపెనీలో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. వివిధ రంగాల సంస్థల సౌజన్యంతో ప్రత్యేకంగా ఆయా విషయ నిపుణులను తీసుకువచ్చి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ తదితర వాటిపై శిక్షణ ఇప్పిస్తున్నది. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే పై చదువులకు అనుగుణంగా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు డేటాసైన్స్, జావా తదితర అంశాల్లో తర్ఫీదునిస్తున్నారు. సాయంత్రం వేళ ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్, న్యూమరికల్, మెంటల్ ఎబిలిటీ, స్పోకెన్ ఇంగ్లిష్ తదితర తరగతులను నిర్వహిస్తూ, మాక్ ఇంటర్వ్యూలు, క్విజ్ పోటీలను ఏర్పాటు చేస్తూ విద్యార్థులను ప్రతిభావంతుల్లా తీర్చిదిద్దుతున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థినులకు వేసవి సెలవుల్లోనూ ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉన్నత భవితకు బాటలు పరుస్తున్నారు. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, మాస్ మ్యూచువల్స్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు గురుకులాలకే వచ్చి ప్రాంగణ నియామకాలను చేపడుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1,000 మందికిపైగా విద్యార్థినులు నేరుగా డిగ్రీ పట్టా చేతికి వచ్చీరాగానే లక్షల ప్యాకేజీతో కొలువుల్లో చేరడం తెలంగాణ గురుకుల విద్యకు గర్వకారణం. గురుకులాలు అందిస్తున్న అవకాశాలతో అట్టడుగువర్గాల విద్యార్థులు కలలను సాకారం చేసుకుంటూ, ఉన్నత ఉద్యోగాలను పొందుతూ సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందుతున్నారు.
➢ పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్ష ఫలితాల్లో గురుకుల విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల సగటు కన్నా ఎక్కువ ఉత్తీర్ణతను సాధిస్తున్నారు.
➢ కళాశాలల్లో చేరుతున్న ముస్లిం బాలికలు 2014-15లో 16 శాతం ఉండగా, 2019-20 నాటికి ఏకంగా 43 శాతానికి పెరిగింది. జాతీయ స్థాయి సగటు 3 శాతం కాగా, తెలంగాణ వృద్ధి రేటు 26 శాతం కావడం గర్వకారణం.
➢ గురుకులాల ఏర్పాటుకు ముందు పాఠశాలల్లో చేరిన ముస్లిం బాలికలు 84 శాతం ఉండగా, ప్రస్తుతం అది 94 శాతానికి పెరిగింది. తెలంగాణ ఏకంగా 10 శాతం వృద్ధిని సాధించి జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలవడం గర్వకారణం.
➢ తొమ్మి దిన్నరేండ్లలో 930 మంది వైద్య విద్యకు ఎంపికయ్యారు. 1,517 మంది విద్యార్థులు ఎన్ఐటీ, ఐఐటీ తదితర ఉన్నత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు అర్హత సాధించారు.
➢ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో 6,450 మంది దళిత, గిరిజన, మైనార్టీ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో సీట్లను పొందారు.
➢ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఫెలోషిప్ను ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థులు సాధిస్తున్నారు.
➢ ఉన్నత విద్యను అభ్యసించే దళిత, గిరిజన, బీసీ విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
➢ జాతీయ సగటును మించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆయా వర్గాల విద్యార్థులు చేరి ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఆలిండియా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే, యుడైస్ తదితర నివేదికల గణాంకాలన్నీ అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
➢ ఇప్పటి వరకు దాదాపు 1,000 మంది విద్యార్థులు నేరుగా గురుకులాల నుంచే వివిధ కంపెనీల్లో ఉద్యోగాలను పొందారు.
– మ్యాకం రవికుమార్