బేగంపేట్, ఆగస్టు 30: ఆస్ట్రియోకాండ్రల్ గాయం కారణంగా కాలు మడమ నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి సికింద్రాబాద్ కిమ్స్-సన్షైన్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఈ చికిత్స విధానం దేశంలో మూడోదిగా కాగా, తెలుగు రాష్ర్టాల్లో మొదటిదని తెలిపారు. బుధవారం దవాఖాన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో చికిత్స వివరాలను ఆర్థోపెడిక్ ట్రామా సర్జన్ డాక్టర్ కమలాకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, జాయింట్ రిప్లేస్ సర్జన్ డాక్టర్ అన్నపురెడ్డి వెల్లడించారు. యాంకిల్ భాగంలో కార్డిలెజ్కు గాయాలైనప్పుడు జాయింట్లో ఒత్తిడి కారణంగా పగుళ్లు మానక జాయింట్లోని ఫ్లూయిడ్ కింద ఎముకలోకి ప్రవేశించి అక్కడ ఎముక దెబ్బ తినేలా చేస్తుందని చెప్పారు. దీంతో కార్డిలెజ్ కూడా దెబ్బతిని తీవ్రమైన నొప్పి వస్తుందని, ఇలాంటి వాటిని ఏ పద్ధతిలో సరిచేయడానికీ వీలు ఉండదని తెలిపారు.
నగరానికి చెందిన 45 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి ఏడాది కాలంగా యాంకిల్ నొప్పితో బాధపడుతూ సన్షైన్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించాడు. స్వీడన్కు చెందిన ప్రముఖ వైద్యుడు ప్రొఫెసర్ లీఫ్రిడ్ నేతృత్వంలో తమ వైద్యబృందం ఏపిసీలర్ జాయింట్ రీసర్ఫేసింగ్ పద్ధతిలో పేషెంట్ యాంకిల్కు ప్రత్యేక ఇంప్లాంట్ అమర్చి అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా చేసినట్టు వివరించారు. ఈ పద్ధతిలో కేవలం కణజాలం దెబ్బతిన్న ప్రాంతాన్ని గుర్తించి ఎమ్మారై 3బీ ఇమేజింగ్ డిజైన్ రూపొందించి సరిపడే ఇంప్లాంట్ను తయారు చేస్తారని తెలిపారు. పాడైన కణజాలాన్ని తొలగించి, కొత్తగా తయారు చేసిన ఇంప్లాంట్ను ఎపిగైడ్ ఉపయోగించి కచ్చితత్వంతో అమర్చినట్టు వారు వివరించారు. ఇప్పటివరకు మన దేశంలో కొచ్చిన్, బెంగళూరులోనే ఈ చికిత్స నిర్వహించగా మూడోది తాము నిర్వహించినట్టు చెప్పారు.