సిద్దిపేట : ఫైలేరియా(బోధకాలు) వ్యాధిగ్రస్తులకు అన్ని జిల్లా కేంద్రాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) వైద్యులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కేంద్రం(Siddipeta District)లోని క్యాంపు కార్యాలయంలో రూ.40 లక్షలతో ఫైలేరియా( Filaria ) వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత కిట్స్ (kitss)పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైలేరియా వ్యాధిగ్రస్తులను బీఆర్ఎస్, సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూస్తున్నదని, వీరికి ఆసరా ఫించన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఫైలేరియా( Filaria )తో బాధ పడుతున్న వారికి కొంత ఊరట కోసం మందులు, సబ్బులతో కూడిన ప్రత్యేక కిట్లు తయారీ చేసి జిల్లాలో పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 8 వేల 121 మందికి పైగా ఫైలేరియా బాధితులకు ఉచితంగా కిట్స్ అందిస్తున్నట్టు వివరించారు.
ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు 3 నెలలకు ఒకసారి మందులు అందిస్తున్నామని, వాటిని వాడుకోవాలని సూచించారు. సిద్ధిపేటతో పాటు జిల్లాలోని అన్నీచోట్ల క్లినిక్ ఏర్పాటు చేసి బోధకాల వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించేలా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యం, ఆసరా పింఛన్లకు సంబంధించిన సమస్యలపై సేవలందించేందుకు ప్రత్యేక సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
కంటి వెలుగు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజాశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాలసాయిరాం, డీఎంహెచ్వో కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.