హైదరాబాద్ : ఆర్టీసీ(TS RTC) ప్రజల సంస్థ అని, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికి పైగా నియామక పత్రాలు అందజేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్లో టీఎస్ ఆర్టీసీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇది నిరంతర ప్రక్రియ అని, అందులో భాగంగా నేడు కొంతమంది కానిస్టేల్స్కి నియామక పత్రాలు అందజేశామన్నారు. ఆర్టీసీ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా మహిళకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు 14 న్నర కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి తెలిపారు. ఆర్టీసీ మనందరిదని, దానిని కాపాడుకోవాలని సూచించారు. ఆర్టీసీని ముందుకు తీసుకుపోవడంలో అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.