ఖైరతాబాద్, జూన్ 6: ఎస్బీఐలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఎస్బీఐ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వనం కిశోర్తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో 7 వేల మంది ఎస్బీఐలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారని, యాజమాన్యం పూర్తిస్థాయిలో వేతనాలు అమలు చేయకపోవడంతో పాటు కోత విధిస్తుండటంతో వారంతా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కేవలం రూ.12 వేల వేతనం చొప్పున ఇస్తూ 12 గంటల పాటు వెట్టిచాకిరీ చేయిస్తున్నారని వివరించారు. ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచికి బలవంతంగా బదిలీలు చేస్తున్నారని విమర్శించారు. కనీస వేతన చట్టం, 8 గంటల విధి విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చనిపోయిన 500 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని తెలిపారు. రాష్ర్టానికి వచ్చే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీనిపై విచారించి న్యాయం చేయాలని, ఉద్యోగుల సర్వీసులను తక్షణమే క్రమబద్ధీకరించాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు అశోక్, రాజు, ఎన్ రవి తదితరులు పాల్గొన్నారు.