హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రారంభించింది. నేడు, రేపు అన్న ఊగిసలాటలు, ఉత్కంఠకు తెరదించుతూ బదిలీల, పదోన్నతుల షెడ్యూల్ విడుదలైంది. సోమవారం నిర్వహించిన విద్యాశాఖాధికారుల సమావేశంలో ఈ షెడ్యూల్ను ఖరారు చేయగా, ఈ నెల 26న అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నెల 27 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుండగా తొలిరోజు సీనియార్టీ జాబితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఈ నెల 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఇక మార్చి 4 నాటికి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తికానుండగా, మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించారు.
ఈ అప్పీళ్లను 15 రోజుల్లో పరిష్కరించేలా షెడ్యూల్ను రూపొందించి విడుదల చేశారు. సీఎం ఆమోదం మేరకు రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ఇటీవలే సీఎం కేసీఆర్ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 15న ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన చర్చల్లో మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్ ఆమోదించిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అదే రోజు ఉపాధ్యాయ సంఘాల నుంచి అన్ని రకాల సూచనలు పరిగణనలోకి తీసుకున్న మంత్రులు విద్యాశాఖ ఉన్నతాధికారులతోనూ సమగ్రంగా చర్చించారు. ఆ తర్వాత మంత్రి సబితాఇంద్రారెడ్డి సైతం ప్రక్రియపై విద్యాశాఖ అధికారులతో పలు మార్లు సమీక్షించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ను రూపొందించి ప్రకటించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం ఎంసీఆర్హెచ్చార్డీలో డీఈవోలతో సమీక్షించి సూచనలు సలహాలు తీసుకున్నారు. ప్రక్రియ ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
9 వేలకు పైగా టీచర్లకు పదోన్నతులు
తాజా ప్రక్రియలో రాష్ట్రంలోని 9 వేలకుపైగా టీచర్లకు పదోన్నతులు లభిస్తాయి. తొలుత హెచ్ఎంల బదిలీలు చేపడుతారు. దీంతో ఖాళీ అయిన హెచ్ఎంల స్థానంలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అయిన స్థానాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తారు. ఇలా 2,013 హెచ్ఎం, 4,163 స్కూల్ అసిస్టెంట్లు, మరో 2500 పైగా వివిధ క్యాటగిరిల్లో పదోన్నతులు లభిస్తాయని, ఇక బదిలీల్లో భాగంగా 40 శాతం టీచర్లకు స్థానచలనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
హర్షం వ్యక్తం చేసిన పీఆర్టీయూ టీఎస్
బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. షెడ్యూల్ విడుదలకాగానే పీఆర్టీయూ టీఎస్ నేతలు నారాయణగూడలోని సంఘం కార్యాలయం ముందు పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేశారు. 37 రోజుల షెడ్యూల్ను విడుదల చేయడం పట్ల పీఆర్టీయూ టీఎస్ నేతలు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేళ శుభవార్తను ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ఇలా..
జనవరి 27: అన్ని క్యాటగిరి ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన సూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితా ఆన్లైన్లో ప్రకటిస్తారు.
జనవరి 28 -30 : బదిలీల కోసం దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు.
జనవరి 31-2: దరఖాస్తు హార్డ్ కాపీలను హైసూల్ టీచర్లు సంబంధిత హెచ్ఎంలకు, ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎంఈవోలు, మండల పరిషత్ పీఎస్, యూపీఎస్ టీచర్లు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైసూల్ హెచ్ఎంలు డీఈవోకు సమర్పించాలి.
ఫిబ్రవరి 3-6 : దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు డీఈవో కార్యాలయంలో సమర్పించడం, పరిశీలన, ఆన్లైన్లో ఆమోదించటం.
ఫిబ్రవరి 7 : డీఈవో/ఆర్జేడీ వెబ్ సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా, పదోన్నతుల సీనియారిటీ జాబితా వెల్లడి.
ఫిబ్రవరి 8 – 10 : అభ్యంతరాల స్వీకరణ పరిశీలన, పరిషారం.
ఫిబ్రవరి 11-12 : తుది సీనియారిటీ జాబితా ప్రకటన, గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల ఎంపిక.
ఫిబ్రవరి 13 : మల్టీజోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయుల వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునఃపరిశీలన .
ఫిబ్రవరి 14 : ఆర్జేడీల ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల విడుదల.
ఫిబ్రవరి 15 : గ్రేడ్ -2 హెచ్ఎంల బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన.
ఫిబ్రవరి 16-18 : అర్హత కలిగిన సూల్ అసిస్టెంట్స్కు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించడం.
ఫిబ్రవరి 19-20 : సబ్జెక్ట్ వారీగా సూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన, బదిలీకి వెబ్ఆప్షన్స్ నమోదు.
ఫిబ్రవరి 21 : వెబ్ ఆప్షన్ల సవరణ, పునః పరిశీలన
ఫిబ్రవరి 22-23 : డీఈవో ద్వారా సూల్ అసిస్టెంట్స్ బదిలీలు చేపట్టడం.
ఫిబ్రవరి 24 : సూల్ అసిస్టెంట్స్ బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన
ఫిబ్రవరి 25- 27 : ఎస్జీటీ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులకు, కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మ్యాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా సూల్ అసిస్టెంట్ పదోన్నతులు.
ఫిబ్రవరి 28-మార్చి 2: ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన, వెబ్ఆప్షన్స్ నమోదు.
మార్చి 3 : వెబ్ ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలన
మార్చి 4 : ఎస్జీటీ తత్సమాన క్యాటగిరీ ఉపాధ్యాయులకు బదిలీలు
మార్చి 5 -19: డీఈవో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీల్స్, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీళ్ళు/అభ్యంతరాలను డీఎస్ఈకి పంపాలి. సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిషరించాలి.
9000 పైగా టీచర్లకు పదోన్నతులు
40% టీచర్లకు స్థానచలనం
మార్చి 4తో ముగియనున్న ప్రక్రియ
మార్చి 5 నుంచి అప్పీళ్లు
15 రోజుల్లో అప్పీళ్ల పరిష్కారం
తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీలు. ఫలితంగా ఏర్పడే హెచ్ఎం ఖాళీల భర్తీ. ఇందుకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల ఎంపిక. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు. తద్వారా ఏర్పడే ఖాళీల భర్తీ. అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి. పారదర్శకంగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ.