హైదరాబాద్ : యాదగిరిగుట్టలో(Yadagirigutta) ప్రొటోకాల్ వివాదంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆలయ ఈవో రామకృష్ణారావుపై(Ramakrishna Rao) ప్రభుత్వం బదిలీ(Transfer )వేటువేసింది. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఆలయ ఈవో రామకృష్ణ ప్రొటోకాల్ పాటించలేదన్న ఆరోపణలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ పట్ల అమర్యాదగా వ్యవహరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో మిగతా మంత్రుల కంటే కాస్త తక్కువ ఎత్తున్న స్టూల్పై డిప్యూటీ సీఎంను కూర్చోబెట్టారు. దీంతో ఉపముఖ్యమంత్రికి అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం స్పందించారు. అవమానం లాంటిది ఏమీ లేదని… తానే కింద కూర్చున్నానని చెప్పుకొచ్చారు.
అయినా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ఈవోపై చర్యలు తీసుకున్నారు. కాగా, మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే పది సమాంతర పీఠలను ఆలయ సిబ్బంది కొనుగోలు చేసింది. పాతవి 4, కొత్తవి 10 పీటలతో సహా ఒకేసారి 14 మంది వీవీఐపీలకు వేద ఆశీర్వచనం చేసేలా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టింది.