Mallanna Sagar | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): మల్లన్నసాగర్కు కాళేశ్వరం జలాల తరలింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రాజరాజేశ్వర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మల్లన్నసాగర్కు కాళేశ్వరం జలాల తరలింపును ఇటీవలే చేపట్టారు. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న రిజర్వాయర్లో ప్రస్తుతం 11.43 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 15 టీఎంసీలు నింపాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా రోజుకు 0.45 టీఎంసీల చొప్పున 10 రోజులు జలాలను తరలించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. శనివారం అన్నపూర్ణ, రంగానాయకసాగర్ నుంచి పంపింగ్ను ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రాష్ట్రంలోనే అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ పనితీరును రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గజ్వేల్ ఈఎన్సీ హరిరాం నేతృత్వంలో ఇంజినీరింగ్ అధికారులు డ్యామ్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డ్యామ్ ప్రొటోకాల్ ప్రకారం ఒకేసారి పూర్తిస్థాయిలో నింపకుండా విడతల వారీగా ఒక్కోస్థాయి వరకు నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్టు పనితీరు బాగున్నదని ఐఐటీ హైదరాబాద్, ఓయూ ప్రొఫెసర్ల ఎక్స్పర్ట్ కమిటీ ధ్రువీకరించడంతో గతేడాది 16 టీఎంసీలను తరలించారు. ఈ క్రమంలో ప్రస్తుతం 15 టీఎంసీలను నింపాలని నిర్ణయించారు. పరీక్షలన్నీ నిర్వహించి తదనంతరం సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు ఈ ఏడాది 20 టీఎంసీల మేరకు నింపేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి 21 వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 68 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబరాజ్ వద్ద 2.63 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా, వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. రాజరాజేశ్వర జలాశయానికి 4,500 క్యూసెక్కుల వరద చేరుతున్నది. కృష్ణాలో వరద ప్రవాహం యథావిధిగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి నిల్వమట్టానికి చేరుకోవడంతో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం జూరాలకు 12వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు 23వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.
మూడు రోజులు తేలికపాటి వాన 11, 12, 13 తేదీల్లో తెలంగాణకు ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 21 డిగ్రీల దక్షిణ అక్షాంశం వెంబడి ఏర్పడిన ద్రోణి బలహీన పడిందని, గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని పేర్కొన్నది. దీంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. శనివారం హైదరాబాద్తోపాలు పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఆదివారంతోపాటు ఈ నెల 12, 13 తేదీల్లో తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.