హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ట్రాన్స్కో, జెన్కోలకు కొత్త డైరెక్టర్లను నియమించాలని శనివారం ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. రెండేండ్ల కాలానికి డైరెక్టర్లను నియమిస్తారని, అత్యవసరమైతే మరో రెండేండ్లు పొడిగిస్తారని పేర్కొన్నారు. కాగా ట్రాన్స్కోలో.. జాయింట్ ఎండీ శ్రీనివాసరావు, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ నర్సింగ్రావు, ట్రాన్స్మిషన్ డైరెక్టర్ జగత్రెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ డైరెక్టర్ సూర్యప్రకాశ్, గ్రిడ్ ఆపరేషన్స్ డైరెక్టర్ నర్సింగారావు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువకాలం పదవిలో కొనసాగారు. ఇక జెన్స్కోలో హైడల్ డైరెక్టర్ వెంకట్రాజం, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సచిదానందం, హెచ్ఆర్ డైరెక్టర్ అశోక్కుమార్, థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, సివిల్ డైరెక్టర్ అజయ్, కమర్షియల్ ఫ్యూయల్ డైరెక్టర్ టీఆర్కే రావు సైతం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువకాలం పదవిలో కొనసాగినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో కొత్త డైరెక్టర్ల కోసం నోటిఫికేషన్లు జారీకానున్నాయి.