హోంమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉర్దూలో శిక్షణ ఇవ్వాలని, అవసరమయ్యే మెటీరియల్స్ను ఉర్దూలో రూపొందించాలని అధికారులను హోం మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. ఉద్యోగార్థులకు ఉర్దూలో శిక్షణ, మెటీరియల్ తయారీ తదితర అంశాలపై తన కార్యాలయంలో సోమవారం హోంమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1, 2, 3 పరీక్షల్లో ఉర్దూ మెటీరియల్ అందించి, విద్యార్థులకు ఉపయోగపడేలా చూడాలని చెప్పారు. తెమ్రిస్ పాఠశాలల్లోని ప్రభుత్వ కోచింగ్ సెంటర్ల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనంతో అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్, మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శి ఒమర్ జలీల్, ప్రొఫెసర్ ఎస్ఏ షాకుర్ తదితరులు పాల్గొన్నారు.