కొత్తగూడెం, మార్చి 25: ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. హోలీ పర్వదినమైన సోమవారం నాడు సాయంత్రం బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బాసగూడ, పున్బాక గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకున్నది. హత్యకు దారి తీసిన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. మృతులను చంద్రయ్య మోడియామి, అశోక్ భండారీ, కారం రమేశ్గా గుర్తించినట్టు తెలిపారు.
బీజాపూర్ జిల్లా కేంద్రంలోని గోర్నా మంకేలి అటవీ ప్రాంతానికి సమీపంలో మావోయిస్టుల మెరుపుదాడిలో ఓ జవాన్కు గాయాలయ్యాయి. అటల్ అవాస్లోకి అకస్మాత్తుగా చొరబడిన మావోయిస్టు యాక్షన్ టీమ్ అక్కడి జవాన్లపై దాడికి దిగింది. అలర్టయిన జవాన్లు ఎదురు కాల్పులకు దిగటంతో మావోయిస్టులు పరారయ్యారు. అయితే అప్పటికే మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో రిజర్వ్ గార్డ్ విభాగానికి చెందిన దీపక్ దుర్గం అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ఆవలం పోడియా మృతి చెందాడు. దానికి ప్రతీకారంగానే ఈ ఆకస్మిక దాడి జరిగినట్టు భావిస్తున్నారు.