హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ (Khairatabad) గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 67 సంవత్సరాల చరిత్రలోనే తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టించారు. 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో మట్టి గణపతిని ప్రతిష్టించడం ఓ రికార్డు. ఉప మండపాల్లో 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవిని ప్రతిష్టించారు. అన్ని విగ్రహాలను పూర్తిగా మట్టితో రూపొందించడం విశేషం.
కాగా, గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసేవరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. భక్తుల వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.