హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. సోమాజిగూడ నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వరకు ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్పురా, సీటీవో, ఎస్బీహెచ్ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్ ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు పైన పేర్కొన్న మార్గంలో ప్రయాణించకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులు మ్యాచ్ ప్రారంభానికి, ముగింపు సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని తెలిపారు.
5 నిమిషాలకో మెట్రో
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో అదనపు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 4 నిమిషాల ఫ్రీక్వెన్సీతో సర్వీసులు నడువనున్నాయి. స్టేడియం వద్ద ఉన్న మెట్రో స్టేషన్లో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు.