హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)పై అత్యాధునిక నిఘా నేత్రాలు నీడలా వెంటాడుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ (హెచ్టీఎంఎస్) వ్యవస్థ ఔటర్పై వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో 158 కి.మీ. పొడవున నిర్మించిన ఓఆర్ఆర్పై ట్రాఫిక్ను ప్రత్యేక నిపుణులు నానక్రాంగూడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గమనిస్తున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించి, రోడ్డు ప్రమాదాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా హెచ్టీఎంఎస్ను అందుబాలోకి తెచ్చినట్టు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్ తెలిపారు. కీలక ప్రాంతాల్లో స్పీడ్గన్లు, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, హెచ్టీఎంఎస్ 24/7 పనిచేసేలా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టిందని వివరించారు. దీని ద్వారా ఓఆర్ఆర్లో ఎవరు ఎక్కడ ప్రయాణిస్తున్నారు? ఎంత సేపట్లో గమ్యస్థానానికి చేరుకొంటారు? ఎక్కడైనా వర్షం పడుతున్నదా? ట్రాఫిక్ జాం ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? జాతీయ, రాష్ట్ర రహదారులు ఎంత దూరంలో ఉన్నాయి? అనే సమాచారం ముందస్తుగానే తెలుస్తుందని, వేరియబుల్ మెసేజ్ సైన్బోర్డు ద్వారా ఈ సమాచారం ప్రయాణికులకు అందుతుందని చెప్పారు.