సూర్యాపేట : దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమై.. 9వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో హైదరాబాద్ – విజయవాడ హైవే(NH 65) పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులు.. టేకుమట్ల నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. ఈ వాహనాలన్నీ నామాపురం వద్ద జాతీయ రహదారి 65పై కలుస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనదారులను రోళ్లబావి తండా వద్ద మళ్లించనున్నారు. రయాన్గూడెం వద్ద హైవేపై కలుస్తాయి.
హెవీ ట్రాన్స్పోర్టు వెహికల్స్ను కోదాడ వద్ద మళ్లించి, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్పల్లి మీదుగా హైదరాబాద్కు పంపించనున్నారు. మొత్తంగా లింగమంతుల స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పెద్దగట్టు జాతరకు రూ. 6.5 కోట్లు కేటాయించారు. మహిళలకు ప్రత్యేక స్నానపు గదులు, చేజింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి కల్పించారు. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు, అధికారులు అంచనా వేస్తున్నారు.
జాతర భద్రత కోసం 1850 మంది పోలీసులు విధుల్లో నిమగ్నం కానున్నారు. 500 మంది వాలంటీర్ల సేవలను వినియోగించుకోనున్నారు. 60 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షించనున్నారు.