బేగంపేట్ ఆగస్టు 30: రోడ్డుపై నడుచుకొంటూ వెళ్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురై కుప్పకూలిపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ ఉన్నతాధికారి అతడి ప్రాణాలు కాపాడి తన గొప్ప మనసును చాటుకొన్నాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గుజ్జుల రాము (40) హైదరాబాద్ బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలో రోడ్డుపై నడుచుకొంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో చాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. ఇది గమనించి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్రెడ్డి అతడికి సీపీఆర్ చేశాడు. వెంటనే ఆ వ్యక్తి స్పృహలోకి రావడంతో అంబులెన్స్లో గాంధీ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించడంతో అతడి ఆరోగ్యం మెరుగైంది. దీంతో అతనికి మందులిచ్చి ఇంటికి పంపించారు. రాము బేగంపేట్ బ్రాహ్మణవాడి వడ్డెర బస్తీలో నివసిస్తున్నాడు. వృత్తి రీత్యా మేస్త్రీ పని చేస్తుంటాడు. కాగా, తన తండ్రిని కాపాడిన పోలీసు అధికారులకు రాము కొడుకు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్నాడని చెప్పారు.
బాధితుడి రాముకు సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ ఏసీపీ మధుసూదర్రెడ్డి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇది చూసిన వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మధుసూదన్రెడ్డిని అభినందనలు తెలిపారు.