నృత్యం నేర్చుకోవాలంటే ఆసక్తి ఒక్కటే సరిపోదు. అవిశ్రాంతమైన కృషి కావాలి. ఆర్థికంగానూ వెసులుబాటు ఉండాలి. ఆ వసతి లేకనే ఎందరో నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అభిరుచి ఉన్నా.. నృత్యం నేర్పించలేకపోతున్నారు. ఎన్ని అవరోధాలున్నా, మన సాంస్కృతిక సంపద అయిన నాట్యకళను భవిష్యత్ తరాలకు అందించాలంటారు ప్రసిద్ధ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ సురభి లక్ష్మీశారద. స్వయంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఆడపిల్లలకు కూచిపూడిలో శిక్షణ అందిస్తూ .. జాతి సంపదను కొత్త తరానికి పంచుతున్నారు.
ఓరోజు పిల్లలకు నృత్యరీతులు నేర్పుతున్నారు సురభి లక్ష్మీశారద. అకస్మాత్తుగా విద్యార్థుల చూపులు గుమ్మం వైపు తిరిగాయి. ఓ ఇద్దరు అమ్మాయిలు నాట్యాన్ని చూస్తూ మురిసిపోతున్నారు. వారిద్దరూ తన పనిమనిషి పిల్లలు. వారిని పిలిచి ‘నాట్యం నేర్చుకోవాలని ఉందా?’ అని అడిగారు. అవునన్నట్టుగా తలూపారు. అంతే, వారిని తన శిష్యులుగా చేర్చుకున్నారు. ఈ ఇద్దరికి మాత్రమే కాదు, ఎందరో నిరుపేద విద్యార్థులను నాట్యకళలో తీర్చిదిద్దాలని నిశ్చయించుకున్నారు. ఆనాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కూచిపూడి నృత్యం నేర్పిస్తున్నారు లక్ష్మీశారద.
నృత్యంతో డాక్టరేట్ లక్ష్మీశారద పదో తరగతి వరకు గుంటూరు తదితర ప్రాంతాల్లో చదివారు. తర్వాత, కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. ‘ఇంటర్ తర్వాత నేను ఎంబీబీఎస్ చేయాలనుకున్నా. కానీ, సీటు రాకపోయేసరికి సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను. అలా డిగ్రీలో బీఎస్సీ (జెనెటిక్స్, బోటనీ, కెమిస్ట్రీ) చేశాను. అయితే, నేను ఆరేండ్ల వయసు నుంచే నాట్యం నేర్చుకున్నా. చిన్నప్పుడే నాట్యప్రదర్శనలు ఇచ్చేదాన్ని. ఎన్నో బహుమతులూ, పురస్కారాలూ అందుకున్నా. డిగ్రీలో ఉండగా అధ్యాపకులు, స్నేహితులు నాట్యాన్నే కెరీర్గా ఎంచుకోమని సలహా ఇచ్చారు. దీంతో, సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ డ్యాన్స్ చేశాను. ఆ రెండేండ్లు మెరిట్ స్కాలర్షిప్తోనే చదివాను. తెలుగు యూనివర్సిటీలో ‘కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఫోక్ అండ్ క్లాసికల్ డ్యాన్స్’ మీద పీహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించా. నృత్యం ఓ థెరపీ. శారీరక, మానసిక ఆరోగ్యానికి చక్కని ఔషధం. మనకు కొత్తగా అనిపించినా యురోపియన్ దేశాల్లోని పెద్ద దవాఖానల్లో డ్యాన్స్ థెరపిస్ట్లు ఉంటారు. నా దగ్గరికి వచ్చేవారికి యోగిక్ డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నా. నాట్యంతో ఆరోగ్య సమస్యలను తగ్గించడమే డ్యాన్స్ థెరపీ. స్పాండిలోసిస్ సమస్య నుంచి నృత్యమే నన్ను కాపాడింది. అధిక బరువుతో సతమతమవుతూ, గర్భం దాల్చలేకపోతున్న ఓ యువతి నృత్యం నేర్చుకొని బరువు తగ్గడమే కాకుండా తల్లి కూడా అయింది. మనోవైకల్యంతో బాధపడుతున్న తన కవల పిల్లలకు నాట్యం నేర్పించాల్సిందిగా ఓ తల్లి నన్ను కోరింది. ఆరునెలల శిక్షణ తర్వాత వారి మానసిక ఆరోగ్యం మెరుగవ్వడం నాట్యానికున్న గొప్పదనానికి నిదర్శనం. నృత్యం ఓ థెరపీ. శారీరక, మానసిక ఆరోగ్యానికి చక్కని ఔషధం వంటిది.
పీజీ పూర్తయ్యాక కొన్నిరోజులకే ‘ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ’లో ఉద్యోగంలో చేరారు లక్ష్మీశారద. ప్రస్తుతం ఆ శాఖ పరిధిలోని ‘హైదరాబాద్ రీజినల్ అవుట్రీచ్ బ్యూరో’లో స్టాఫ్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. నాట్యం ద్వారా ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం ఆమె బాధ్యత. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, విపత్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నాట్యకళ ద్వారా తెలియజేసేవారు. కొవిడ్ జాగ్రత్తలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.
2006లో హైదరాబాద్ కొత్తపేటలోని తమ నివాసంలో ‘శ్రీ సురభి ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్’ ఇనిస్టిట్యూట్ను ప్రారంభించారామె. ఇందులో కూచిపూడి నాట్యంతో పాటు సంగీత, వాద్యాల్లో (గిటార్, వయొలిన్) శిక్షణ ఇస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
‘ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారంతా దాదాపుగా నిరుపేదలే. నాట్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా.. అందుకు తగ్గ వెసులుబాటు ఉండదు. మా ఆయన అవధానం శ్రీనివాసులు కొత్తపేటలోని జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినుల్లో నాట్యంపై ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేయమని చెప్పాను. ఓ నలభై మందిని ఎంపిక చేసి, నాట్యంలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. లాక్డౌన్కు ముందువరకూ ప్రతి శనివారం పాఠశాలకు వెళ్లి తరగతులు నిర్వహించాను. ఆసక్తి ఉన్నవారిని ఆదివారం మా ఇంటికి కూడా రమ్మని చెప్పేదాన్ని. కొవిడ్ కారణంగా ఆటంకాలు ఎదురయ్యాయి. మళ్లీ పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరుచుకున్న తర్వాత ఈ ఉచిత శిక్షణ కొనసాగిస్తాను’ అని చెప్పుకొచ్చారు లక్ష్మీశారద.
“లాక్డౌన్కు ముందు ఓ కొత్త కార్యక్రమాన్ని రూపొందించాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లలకు ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’, ‘హౌ టు ప్రొటెక్ట్ హర్సెల్ఫ్’ వంటి కాన్సెప్ట్ల మీద నాట్యం ద్వారా అవగాహన కల్పించాలనుకున్నాను. దానికోసం నా విద్యార్థులకు ట్రైనింగ్ కూడా ఇచ్చాను. పాఠశాలలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాక హైదరాబాద్ చుట్టు పక్కల ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తాను. నాకు తెలుగు భాషన్నా ప్రీతి. అందుకే, తెలుగు భాష మీద ‘తెలుగు వీర లేవరా’ పేరుతో ఒక లఘుచిత్రం రూపొందించాను.
… నిఖిత నెల్లుట్ల