కాంగ్రెస్ పార్టీలో ఉనికి కోసం పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రకు పార్టీలోని సీనియర్లు దూరం గా ఉంటున్నారు. ‘హాథ్ సే హాథ్ జోడో’ ఇప్పుడు చేతులు కలవని యాత్రగా కనిపిస్తున్నది.
‘హాథ్ సే హాథ్ జోడో’కు జనంకరువు
నర్సంపేటకు రావొద్దన్న ఇన్చార్జి
హడావిడిగా రూటు మార్చిన రేవంత్
వరంగల్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీలో ఉనికి కోసం పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రకు పార్టీలోని సీనియర్లు దూరం గా ఉంటున్నారు. ‘హాథ్ సే హాథ్ జోడో’ ఇప్పుడు చేతులు కలవని యాత్రగా కనిపిస్తున్నది. రేవంత్రెడ్డికి సన్నిహితంగా ఉండే నలుగురైదుగురు మినహా కాంగ్రెస్ ముఖ్యులు ఎవరూ యాత్ర వైపు కనీసం చూడటం లేదు. ములుగు జిల్లా మేడారంలో సోమవారం యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రా, బస్సు యాత్రా అని స్పష్టతలేని రేవంత్రెడ్డి సొంత కార్యక్రమానికి కాంగ్రెస్లోని అత్యధికులు దూరంగానే ఉంటున్నారు.
జాతీయ, రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాయకులదీ ఇదే పరిస్థితి. రేవంత్రెడ్డి యాత్ర ప్రారంభించిన మేడా రం ప్రాంతం ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నది. రేవంత్రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ సెగ్మెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఉన్నా రేవంత్రెడ్డి పాదయాత్రకు స్పందన కనిపించడం లేదు.
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రేతోపాటు పోదెం వీరయ్య, షబ్బీర్ అలీ, మధుయాష్కి, అంజన్కుమార్ యాదవ్, మల్లు రవి, జీ చిన్నారెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కొండా మురళీధర్రావు, ఇందిర మాత్రమే మొదటి రోజు యాత్రలో పాల్గొన్నారు. జిల్లాలోని సీనియర్ నేత పొన్నా ల లక్ష్మయ్య, దొంతి మాధవరెడ్డి, మాజీ మే యర్ ఎర్రబెల్లి స్వర్ణ వంటి నేతలు యాత్రకు దూరంగా ఉన్నారు.
కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా రాష్ర్టానికి చెందిన ఏఐసీసీ, పీసీసీ ముఖ్యనేతలు రేవంత్ యాత్రతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు సెలవు ఉన్నప్పటికీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి ఆ యాత్ర వైపు వెళ్లలేదు. ఇక సోమవారం, మంగళవారం ములుగు సెగ్మెంట్లో పూర్తి చేసుకొన్న యాత్ర.. బుధవారం, గురువారం నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగాలి.
కానీ, రేవంత్రెడ్డి యాత్రతో ఉపయోగం లేదని గ్రహించిన నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన నియోజకవర్గంలో యాత్ర వద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో రేవంత్రెడ్డి నర్సంపేట సెగ్మెంట్ను మినహాయించి మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో బుధ, గురువారాల్లో యాత్ర నిర్వహించేలా హడావిడిగా కొత్త రూట్ మ్యాప్ను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఏదేమైనా.. కాంగ్రెస్లో అందరినీ కలుపుకొని పోయేందుకు రేవంత్రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్ర ఒంటరిగానే సాగుతున్నది.