హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నక్సలైట్లు ఉంటే బాగుండేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నక్సలైట్లు లేకపోవడం వల్లనే రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నదని అన్నారు. ‘తెలంగాణలో వ్యవస్థను చూసి ఎందుకురా దేవుడా ఈ రోజు నక్సలిజం, నక్సలైట్లు లేకుండా చేసినవ్ అనిపిస్తున్నది. నక్సలైట్లు లేకుంటే తెలంగాణకు అన్యాయం జరిగిందనే పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధి ఉండాలంటే నక్సలైట్లు ఉండొద్దని అనుకున్నం. ఇప్పుడు నిజంగానే నక్సలైట్లు ఉంటే తెలంగాణకు మేలు జరుగుతుండెనేమో అని అనిపిస్తున్నది’ అన్నారు. వెంటనే ‘ప్రజా ప్రతినిధులం ఇలా కోరుకోం. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలని కోరుకుంటాం’ అంటూ శాంతివచనాలు పలికారు.
బాధ్యతారహిత వ్యాఖ్యలు
రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణవాదులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పడిన బాధలను గుర్తుచేసుకొంటున్నారు. నక్సలైట్ల సిద్ధాంతాలు మంచివే అయినప్పటికీ వారు ఎంచుకున్న సాయుధ పోరాట పంథాతో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ ప్రాంతమే. సాయుధ ఉద్యమం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అటు నక్సలైట్లవైపు, ఇటు పోలీసులవైపు వందలమంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరిలో డాక్టర్లు, ఇంజినీర్ల వంటి ఉన్నత విద్యావంతులు, మేధావులు కూడా ఉన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. నిత్యం ప్రజలు భయంతో బతికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్నిరంగాల్లో అభివృద్ధి ఊపందుకోవటంతో ప్రజలకు చేతినిండా పని దొరుకుతున్నది. యువతకు ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి. దాంతో వారంతా నక్సలిజం నుంచి పక్కకు జరిగారు. ఈ పరిణామంతో సహజంగానే రాష్ట్రంలో నక్సలిజం దానంతట అదే తగ్గిపోయింది. ఇప్పుడు ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి మళ్లీ నక్సలిజం మాటెత్తటంతో ప్రజలు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న సమాజంలో అలజడి సృష్టించాలనుకొంటున్నారా? అని నిలదీస్తున్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకోసం రేవంత్రెడ్డి ఎంతకైనా దిగజారుతాడని విమర్శిస్తున్నారు.