Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ గురువారం నోటీసులు ఇచ్చింది. కుల గణన నివేదికపై మల్లన్న కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కుల గణన సర్వేలో బీసీల సంఖ్య తగ్గించినట్లుగా చూపించడంపై ఆయన సొంత ప్రభుత్వంపైనే తీవ్రంగా విమర్శించారు.
సర్వేను తప్పుపడుతూ తీవ్ర పదజాలంతోనే సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కుల గణన నివేదికను సైతం తగులబెట్టాలని పిలుపునిచ్చారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. బీసీ జనాభా తగ్గడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని తీవ్ర విమర్శల పాలు చేసింది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.