Revanth Reddy | వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్ ఎందుకు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయానికి నిరంతరాయ కరెంట్, రైతుబంధు పథకాలను కొనసాగిస్తారా? లేదా? అని అమెరికాలో ఎన్ఆర్ఐలు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు తన మనసులోని మాటను రేవంత్ రెడ్డి బయటపెట్టారు.
‘ ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట చాలు.. మూడెకరాలకు ఫుల్లుగా నీళ్లు పట్టాలంటే మూడు గంటలు చాలు.. అంటే రోజుకొక 8 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుంది.’ అని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు నిరంతరాయ ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్పై తన కుల్లును బయటపెట్టారు. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే స్లోగన్ తీసుకొచ్చాడని ఆరోపించారు. ఉచిత కరెంట్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు, రైతులు భగ్గుమన్నారు. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉన్నాయని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యుత్ ఇవ్వకుండా గతంలో రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందని అన్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.