వెంకటాపూర్, ఆగస్టు 1: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిన తరువాత పర్యాటకులు, భక్తుల తాకిడి పెరుగుతున్నది. ఆదివారం సెలవు రోజుతోపాటు స్నేహితుల దినోత్సవం కూడా కావడంతో సుదూర ప్రాంతాల నుంచి సుమారు 15 వేల మంది రామప్ప సందర్శనకు వచ్చారు. ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. నందీశ్వరుడి వద్ద ఫొటోలు దిగుతూ సందడి చేశారు. గైడ్లు రామప్ప శిల్ప కళా సౌందర్యాన్ని పర్యాటకులు, భక్తులకు వివరించారు. కాగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు.