హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. భాషా సాంసృతిక, పురావస్తు శాఖలు, నిథమ్ సంస్థల సంయుక్త సమన్వయంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సోమవారం ఈ కార్యక్రమాన్ని జహీరాబాద్లో మంత్రి జూపల్లి ప్రారంభించనున్నారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్లో ‘డెస్టినేషన్ తెలంగాణ : స్ట్రాటజీస్ ఫర్ ది నెక్ట్స్ ఫ్రంటియర్ ఆఫ్ టూరిజం’ ఇతివృత్తంతో ‘పర్యాటక సదస్సు (టూరిజం కన్క్లేవ్) – 2026’ నిర్వహించనున్నారు.