మహబూబ్నగర్ టౌన్, జూన్ 17: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న పర్యాటక పనులను పరుగులు పెట్టించాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మహబూబ్నగర్ పట్టణంలో మినీ ట్యాంక్బండ్, ఐలాండ్, నెక్లెస్ రోడ్డు, తీగల వంతెన పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. మినీ ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు పనులను రెండు షిఫ్టుల్లో చేపట్టి వేగంగా పూర్తి చేయాలన్నారు.
కలెక్టర్ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలు అక్కడే ఉండి పర్యవేక్షించాలని సూచించారు. పనులు పూర్తయ్యాక కృష్ణా జలాలతో మినీ ట్యాంక్బండ్ను నింపుతామని చెప్పారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో మహబూబ్నగర్లోని న్యూప్రేమ్నగర్లో ముదిరాజ్ భవనంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన కుట్టుమెషిన్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.