హరిత హోటల్స్లో 50%పైనే బుకింగ్స్
రెండు నెలల్లో 11.40 కోట్ల ఆదాయం
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. కొవిడ్ అదుపులోకి రావడంతో పాటు వేసవి సెలవుల నేపథ్యంలో గత రెండునెలల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్న హైదరాబాద్ (తారామతి), వరంగల్ (కాకతీయ) హోటళ్లలో ప్రతి రోజు 80 శాతం వరకు బుకింగ్స్ అవుతున్నాయి. గదులతో పాటు ఆహారానికి కూడా ఇక్కడ డిమాండ్ బాగుంది. సాలార్జంగ్ మ్యూజియం, నిజామాబాద్, భద్రాచలం, లక్నవరం, నాగార్జునసాగర్, యాదగిరిగట్ట, ప్రజ్ఞాపూర్ ప్రాంతాల్లో హరితహోటళ్లు దాదాపు 50శాతానికిపైగా బుకింగ్లో ఉన్నాయి.
మిగిలిన ప్రాంతాల్లోనూ 30 శాతానికిపైగా గదులు బుక్ అయ్యాయి. బోటింగ్కు సైతం రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది. దీంతో గడిచిన రెండు నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ)కి హరితహోటళ్లు, బోటింగ్ నుంచి రూ.11.40 కోట్ల ఆదాయం సమకూరింది. 30 ఏండ్ల చరిత్రలో తొలిసారి ట్యాంక్బండ్ బోటింగ్ నుంచి ఒక్క మే నెలలోనే రూ.1.15 కోట్ల కలెక్షన్ వచ్చిందని టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా తెలిపారు. కొవిడ్ తర్వాత గత రెండు నెలలుగా పర్యాటకుల తాకిడితో ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు.