పాలకవీడు, ఇబ్రహీంపట్నం/హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 14 (నమస్తే తెలంగాణ):రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తల-మొండెం కేసు ఇంకా మిస్టరీగానే ఉన్నది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్కు చెందిన జైహింద్నాయక్ (రమావత్ జయేందర్) తల నల్లగొండ జిల్లా పరిధిలో, మొండెం రంగారెడ్డి జిల్లా పరిధిలో దొరకటంతో నల్లగొండ-రాచకొండ పోలీసులు రంగంలోకి దిగి విచారణ ముమ్మరం చేశారు. ఎవరు హత్య చేశారనే దానితో పాటు, హత్య వెనక అసలు ఉద్దేశం ఏమిటన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. మొండెం లభించిన రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుర్కయాంజాల్లో ఉన్న అసంపూర్తి భవనాన్ని శుక్రవారం పరిశీలించిన నల్లగొండ జిల్లా పోలీసులు.. అక్కడ మృతుడికి చెందిన రెండు సంచులను స్వాధీనం చేసుకొన్నారు. చుట్టుపక్కల వారిని విచారించడంతో పాటు పరిసరాల్లోని సీసీ కెమెరాలనూ పరిశీలిస్తున్నారు. మృతుడి కుటుంబపరంగా చూస్తే అతడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ పెద్దగా లేదని భావించి, అసంపూర్తి భవనం, దాని యజమాని కుటుంబసభ్యులపై ఫోకస్ పెట్టారు. కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. ఆ భవనం పక్కనే ఉన్న హార్డ్వేర్ దుకాణం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. తుర్కయాంజాల్ మొదలు తల లభించిన మాల్ వరకు బొంగుళూరు ఔటర్ జంక్షన్, యాచారం, ఇబ్రహీంపట్నం, మాల్ ఇలా అన్ని ప్రదేశాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
కేశ్యానాయక్ అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఎక్స్రోడ్డు సమీపంలో జీ+4 భవన నిర్మాణాన్ని 2018లో చేపట్టాడు. అతనికి ఇద్దరు భార్యలు. భవన నిర్మాణం కొనసాగుతుండగాలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ భవనం కోసం ఇద్దరి భార్యల మధ్య గొడవ నడుస్తున్నది. ఖాళీగా ఉండటంతో ఆ ఇంట్లోనే కొంతకాలంగా జైహింద్ నాయక్ ఉంటున్నట్టు తెలిసింది. శుక్రవారం భవనాన్ని పరిశీలించిన పోలీసులు.. భవనంలోని మెట్లపై రక్తపు చుక్కలు పడి ఉన్నట్టు గుర్తించారు. పైఅంతస్థులో హత్యచేసి మొండేన్ని కింద నిర్మాణ వ్యర్థాల్లో దాచిపెట్టే ప్రయత్నం చేశారని భావిస్తున్నారు. దీంతో పోలీసులు కేశ్యానాయక్ ఇద్దరు భార్యలతో పాటు మరికొంతమంది అనుమానితులను విచారిస్తున్నారు. అసలు హత్య ఎవరు చేశారు? దాని వెనక కారణాలు ఏంటి? అనేది ఇంకా అంతుచిక్కడం లేదు. ఇదిలా ఉండగా, వనస్థలిపురం, చింతపల్లి పోలీసులు, తండ్రి, బంధువుల సమక్షంలో జైహింద్నాయక్ మృతదేహానికి శుక్రవారం ఉస్మానియా దవాఖానలో పోస్టుమార్టం చేశారు. ఆ వివరాలు మరో రెండురోజుల్లో పోలీసుల చేతికి రానున్నాయి. మృతదేహాన్ని జైహింద్నాయక్ తండ్రికి అప్పగించగా, శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్లో అంత్యక్రియలు పూర్తిచేశారు.