ములుగు, మే 14 (నమస్తేతెలంగాణ): పాతరాతి యుగం నాటి మానవ స్మారక శిలలను ములుగు జిల్లా మంగపేట మం డలం కొత్తూరు – మొట్లగూడెం గ్రామానికి దగ్గరలో ఉన్న రాజారామ్ సుద్దగుట్ట పరిధిలో ఆదివారం టీమ్ ఆఫ్ రిసర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్) టీమ్ సభ్యులు గుర్తించారు. యువ చరిత్రకారుడు, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ఆర్య మాట్లాడుతూ..
తాము సుద్దగుట్టను సందర్శించి స్మారక శిలను గుర్తించినట్టు తెలిపారు. ఆదిమానవులు సమాధుల వద్ద నిలువు రాళ్లను పాతే పద్ధతిని పాటించేవారని అన్నారు. స్థానిక సమూహంలో ముఖ్యులుగా భావించే వారి సమాధుల వద్ద పాతే ఇలాంటి రాళ్లను ‘మెన్హిర్లు’ లేదా నిలువు రాళ్లు అంటారని పేర్కొన్నారు. చారిత్రక ఆధారాలను పురావస్తు శాఖ అధికారులు పరిరక్షించాలని కోరారు.