హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు అగ్రనాయకులు అనారోగ్యంతో సతమతమవుతున్నారని, వరుస అరెస్టులు, యువ నాయకుల్లో సరైన అవగాహన లేక ఆ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. మావోయిస్టు పార్టీ ఏ సమయంలోనైనా దానికదే కుప్పకూలే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. మావోయిస్టు ఆర్గనైజేషన్లో పీపుల్స్వార్, ఎంసీసీఐ (మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా) మధ్య అగాథం ఏర్పడినట్టు సమాచారం ఉన్నదని తెలిపారు.
దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జెడ్సీ) మెంబర్ ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్క శనివారం డీజీపీ కార్యాలయంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. విచారణలో ఉషారాణి పలు అంశాలు వెల్లడించినట్టు పేర్కొన్నారు. పార్టీలో ప్రస్తుతం క్యాడర్ మార్కిస్ట్, లెనినిస్ట్ భావజాలం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నదని, అగ్ర నాయకులంతా వయోభారం, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ముప్పాళ్ల లక్ష్మణ్రావు కనీసం నడవలేని, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని, గత రెండేండ్లలో అగ్రనాయకులైన రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న, అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, యాపనారాయణ అలియాస్ హరిభూషణ్ వ్యాధులతో సహజమరణం పొందారని గుర్తుచేశారు.
ఈ మధ్య కాలంలో సెంట్రల్ కమిటీ సభ్యులు ప్రశాంత్బోస్ అలియాస్ కిషన్దా, శీలామరాండి అలియాస్ హేమ, రంజిత్బోస్ అలియాస్ కబీర్, మిథిలేశ్ మెహతా అలియాస్ మోహిత, విజయ్కుమార్ అలియాస్ జెస్పాల్, బీజీ కృష్ణమూర్తి అలియాస్ కుమార్ అరెస్టు అయ్యారని చెప్పారు. నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు చనిపోవడం, మరో ఆరుగురు అరెస్టవటం.. మిగతావాళ్లు వయోభారం, అనారోగ్యంతో తిరిగే పరిస్థితి లేకపోవడంతో మావోయిస్టు పార్టీ కుప్పకూలడానికి దగ్గరపడిందని అభిప్రాయపడ్డారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో తెలంగాణ నాయకులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే మెరుగైన వైద్యం, ప్రభుత్వ విధానం ప్రకారం వసతులు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణలో మావోయిస్టులు అడుగుపెట్టకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.
ఆలూరి ఉషారాణి నేపథ్యం
ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్క అలియాస్ పోచక్క అలియాస్ భాను దీదీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తూ లొంగిపోయారు. నల్లగొండ సీపీఐ (ఎంఎల్) జిల్లా కమిటీ కార్యదర్శి ముక్క వెంకటేశ్వర్ గుప్తా అలియాస్ కిరణ్ను వివాహం చేసుకోగా, 1998లో ఎదురుకాల్పుల్లో ఆయన మృతిచెందారు. మునుగోడు, రాచకొండ దళాల్లో తొలుత పనిచేసిన ఉషారాణి తర్వాత మావోయిస్టు మ్యాగజైన్ భూంకల్ సుదేశ్కు ఎడిటర్గా దాదాపు 15 ఏండ్లపాటు, మొబైల్ పొలిటికల్ స్కూల్లో టీచర్గానూ పనిచేశారు. ఐదుగురు పోలీసులపై దాడి, మూడుసార్లు ఎదురుకాల్పులు, మూడు సార్లు ప్రభుత్వ భవనాల కూల్చివేత వంటి కేసులు ఆమెపై ఉన్నాయి.