President visit : ఈ నెల 28న (రేపు) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో నిన్న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు.
అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 8 రాష్ర్టాలకు సంబంధించిన స్టాళ్లను, 4 ఫుడ్ కోర్టులను, మీడియా సెంటర్ను, ఇతర స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్పీఎస్, పీఎన్టీ జంక్షన్, రసూల్పురా, సీటీవో ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు.
నల్సార్ 21వ స్నాతకోత్సవం
మేడ్చల్ జిల్లా శామీర్పేట పరిధిలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం 28న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) హాజరవుతున్నారు. గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, నల్సార్ ఛాన్స్లర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహులు విచ్చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ వీసీ క్రిష్ణదేవరావ్ గురువారం మీడియాకు వెల్లడించారు.